భద్రాద్రి జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నది. పారిశ్రామిక పట్టణ ప్రాంతాల్లోనే హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నట్లు వైద్యారోగ్యశాఖ పరిశీలనలో తేలింది. ఇప్పటి వరకు జిల్లాలో 2,576 మంది ఎయిడ్స్ రోగులు మందులు వాడుతున్నారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు 53,347 మంది రక్తపూతలను పరీక్షించారు. వీరిలో 187 మందికి మాత్రమే హెచ్ఐవీ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): సరైన మందు లేని భయంకర వ్యాధి ఎయిడ్స్. ఈ వ్యాధిపై ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. వీటి ఫలితంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కేవలం పారిశ్రామిక పట్టణ ప్రాంతాల్లోనే హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నట్లు వైద్యారోగ్య శాఖ పరిశీలనలో తేలింది. ఇప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,576 మంది ఎయిడ్స్ రోగులు మందులు వాడుతున్నారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు 53,347 మంది రక్త పూతలను పరీక్షించారు. వీరిలో 187 మందికి మాత్రమే హెచ్ఐవీ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.
హెచ్ఐవీ – ఎయిడ్స్.. రెండూ ఒక్కటేనా..?
కాదు. ఈ రెండింటికీ సంబంధం ఉన్నప్పటికీ.. రెండూ ఒక్కటి కాదు. కొన్ని వ్యాధులకు మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ.. ఇలా ఉంటాయి కదా..! హెచ్ఐవీ, ఎయిడ్స్ కూడా అంతే. హెచ్ఐవీ (హ్యూమనో డెఫిసియెన్సీ వైరస్)ని మొదటి దశగా, ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిసియెన్సీ సిండ్రోమ్)ను చివరి దశగా చెప్పుకోవచ్చు. హెచ్ఐవీ బాగా ముదిరితే.. మన శరీరంలోని రోగ నిరోధక శక్తి పూర్తిగా దెబ్బతింటుంది. ఈ దశనే ఎయిడ్స్గా పిలుస్తుంటాం. హెచ్ఐవీ సోకినట్లుగా నిర్ధారణ కాగానే.. మందులు వాడితే పూర్తిగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.
హెచ్ఐవీ ఉన్నట్లుగా గుర్తించకపోయినా, గుర్తించినప్పటికీ మందులు వాడకపోయినా.. అది క్రమక్రమేణా పెరుగుతూ (అంటే, మన శరీరంలోని రోగ నిరోధక శక్తి/వ్యవస్థ క్రమక్రమంగా దెబ్బతినడం) దాదాపుగా పదేళ్లలోగానీ, అంతకన్నా కొంచెం ముందుగానీ ఎయిడ్స్గా మారుతుంది. ఎయిడ్స్ నిర్ధారణ అయిందంటే.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అర్థం. ఈ దశలో మందులు కూడా పనిచేయకపోవచ్చు. ఎయిడ్స్ నిర్ధారణ అయిన తర్వాత.. సాధారణంగా జీవిత కాలం ఐదేళ్లకు మించి ఉండకపోవచ్చన్నది వైద్యుల మాట.
భద్రాద్రి జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయంటే…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 5,387 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించారు. భద్రాచలం ఏఆర్టీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ) సెంటర్లో 2,576 మంది మందులు వాడుతున్నారు. ఇందులో 1,259 మంది ఆసరా పింఛన్ పొందుతున్నారు. వీరిలో హైరిస్క్ బిహేవియర్ కలిగిన వారు (సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు) 8,164 మంది ఉన్నారు. వీరికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఐసీటీసీ (ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్) సేవలందిస్తున్నాయి.
ఐసీటీ కేంద్రాలు
కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఆశ్వారావుపేటలో ఐసీటీ కేంద్రా(ఐసీటీసీ)లు ఉన్నాయి. హెచ్ఐవీ సోకిన వారికి అవగాహన కల్పించేందుకు, మందులు ఇచ్చేందుకు ఇతర ఆసుపత్రుల్లోనూ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పాల్వంచ, అశ్వారావుపేట, మణుగూరు ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. హెచ్ఐవీ పాజిటివ్ బాధితుల సమాచారాన్ని ఈ కేంద్రాల నిర్వాహకులు గోప్యంగా ఉంచుతున్నారు. హెచ్ఐవీ పాజిటివ్ బాధితులు సలహాలు, సూచనల కోసం NACO AIDS APP, 1047 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు.
హెచ్ఐవీ సోకిందా..? భయపడొద్దు.. వణికిపోవద్దు
హెచ్ఐవీ సోకినట్లుగా(హెచ్ఐవీ పాజిటివ్)గా నిర్ధారణ కాగానే.. ఆ బాధితుల్లో కొందరు విపరీతంగా భయపడుతుంటారు. తమకు ఎయిడ్స్ సోకిందని వణికిపోతుంటారు. హెచ్ఐవీ సోకిందంటే.. ఎయిడ్స్ వచ్చినట్లుగా కాదన్న విషయాన్ని ఇలాంటి వారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. హెచ్ఐవీని మొదటి దశలోనే గుర్తించి, తగిన మందులు వాడితే దాని నుంచి పూర్తిగా బయటపడవచ్చు. మనందరికీ తెలిసిన క్యాన్సర్ వ్యాధిలో దశలు ఉంటాయి. మొదటి దశలోనే దానిని గుర్తించి, మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది.
ఎయిడ్స్ కూడా అంతే. దానిని మొదటి దశ(హెచ్ఐవీ)లోనే గుర్తించి, తగిన మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది. కానీ, హెచ్ఐవీ పాజిటివ్ అనగానే.. బెంబేలెత్తి, భయంతోనో/సిగ్గుతోనో మందులు వాడకపోతేనే ప్రాణ నష్టం ఉంటుంది. దీనిపై ఒకవైపు వైద్యారోగ్య శాఖ, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. అయినప్పటికీ కొందరు వినకుండా, నిర్లక్ష్యంతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భిణులకు వైద్యులు అన్ని పరీక్షల్లాగానే.. హెచ్ఐవీ పరీక్ష కూడా చేస్తారు. ఎవరికైనా హెచ్ఐవీ పాజిటివ్గా తేలితే.. వారు తప్పనిసరిగా మందులు వాడాలి. లేనట్లయితే, పుట్టబోయే బిడ్డకు కూడా ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది.
అందుకే, ముందస్తు చర్యల్లో భాగంగా ప్రసవానికి వచ్చే ప్రతి గర్భిణితోపాటు ఆమె భర్తకు కూడా వైద్యులు హెచ్ఐవీ పరీక్ష చేస్తున్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరికి హెచ్ఐవీ సోకినా.. అది పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదం ఉంది. ఈ దంపతుల్లో ఎవరికైనా హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలితే.. అది బిడ్డకు సోకకుండా మందులు అందుబాటులో ఉన్నాయి. ‘ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. అడపాదడపా కేసులు వస్తూనే ఉన్నాయి. భద్రాచలం, కొత్తగూడెం కేంద్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటున నెలకు 10 నుంచి 20 కేసులు వస్తూనే ఉన్నాయి’ అని వైద్యులు చెబుతున్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్పై అవగాహన పనెంచేందుకు ప్రతి ఏటా డిసెంబర్ 1వ తేదీని ‘ఎయిడ్స్ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం.
అవగాహన కల్పిస్తున్నాం
కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఆ రెండేళ్లలో కేసులు కూడా పెద్దగా రాలేదు. ప్రతి ఆసుపత్రిలోనూ అవగాహన కేంద్రాలు ఉన్నాయి. మా వద్దనున్న రికార్డుల ప్రకారం ఈ జిల్లాలో సెక్స్ వర్కర్లు 6,330 మంది, స్వలింగ సంపర్కులు 1,735 మంది, ట్రాన్స్జెండర్స్ 99 మంది ఉన్నారు. హెచ్ఐవీ అంటువ్యాధి కాదు. లైంగిక సంపర్కం, రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అది సోకితే మాత్రం.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే, క్రమం తప్పకుండా మందులు వాడాలి.
– డాక్టర్ జె.శిరీష, లెప్రసీ-ఎయిడ్స్ ప్రోగ్రాం ఆఫీసర్