అశ్వారావుపేట, మార్చి 15: వ్యవసాయ అనుబంధ రంగాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యవసాయ కళాశాల అసోషియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్కుమార్ స్పష్టం చేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలను సందర్శించిన ములకలపల్లి మండలానికి చెందిన మహిళా రైతులతో శుక్రవారం ఆయన మాట్లాడారు.
పుట్టగొడుగుల పెంపకం, వానపాముల ఎరువు, జీవన ఎరువుల తయారీ ద్వారా మహిళా రైతులు నికర ఆదాయం పొందవచ్చని వివరించారు. కుటీర పరిశ్రమల ఏర్పాటు స్వయం ఉపాధికి దోహదపడుతుందని అన్నారు. ఇందుకు ప్రభుత్వం సబ్పిడీ పధకాలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పుట్టగొడుగుల పెంపకంపై డాక్టర్ శ్రీలత, వానపాముల ఎరువుల తయారీపై డాక్టర్ పావని, జీవన ఎరువుల తయారీపై డాక్టర్ పీ.రెడ్డిప్రియ మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు. కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ జీ.గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ దీపక్రెడ్డి పాల్గొన్నారు.