ఖమ్మం వ్యవసాయం/ కూసుమంచి/ కామేపల్లి, జూన్ 27: అవును. వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. జూలై సమీపించినా వర్షాలు కురవకపోవడం, ఎండలు మండిపోతుండడం, కోతుల బెడదతో గ్రామాల్లో రైతులు ఉద్యాన పంటల సాగుపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఫలితంగా ఇతర రాష్టాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు కేజీ రూ.50లోపే ఉన్న పచ్చిమిర్చి ధర తాజాగా రెట్టింపునకు పైగా పెరిగింది. టమాట ధర కూడా రూ.100 దాటింది. ఏటా కొత్త పంటలు చేతికొచ్చే సమయంలో ధరలు కొంత మేరకు పెరగడం సహజమే అయినప్పటికీ నిరుటితో పోల్చుకుంటే ఈ ఏడాది రెండు రెట్లు పెరిగినట్లయింది. సీజన్కు అనుగుణంగా ఒక రకం కూరగాయల ధరలు పెరిగితే మరో రకం కూరగాయల ధరలు తగ్గుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. పచ్చి మిర్చి, టమాట లేకుండా ఏ కూర వండలేము. అయితే ప్రస్తుతం వాటి ధరలు సెంచరీ దాటి పరుగులు తీస్తున్నాయి.
ఖమ్మం సమీకృత మార్కెట్లో ధరలు ఇలా..
ఖమ్మంలోని సమీకృత రైతుబజార్లో మంగళవారం నమోదైన కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.100, పచ్చిమిర్చి రూ.120, చిక్కుడు రూ.80, గోరుచిక్కుడు రూ.45, క్యాబేజీ రూ.30, వంకాయ రూ.40, కాకరకాయ రూ.45, బీన్స్ రూ.80, క్యారెట్ రూ.56, బీట్రూట్ రూ.40, ఆలుగడ్డ రూ.24, చామగడ్డ రూ.46, బీరకాయ రూ.48, దోసకాయ రూ.46, దొండకాయ రూ.30, సొరకాయ రూ.20, ములక్కాయ (కేజీ) రూ.75, క్యాప్సికం రూ.66, కూర అరటి (ఒకటి) రూ.20, ఉల్లిగడ్డ రూ.20 రెండు కట్టల ఆకు కూరలు రూ.20 చొప్పున ఉన్నాయి. ఇవే కూరగాయల ధరలు రిటైల్ షాపుల్లో రెండింతలు పలుకుతున్నాయి.
జిల్లాలో గణనీయంగా తగ్గిన ఉత్పత్తి..
జిల్లాలో యాసంగిలో కూరగాయలు, ఆకు కూరల సాగు గణనీయంగా తగ్గింది. ఇక్కడ ఉత్పత్తి తగ్గిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట తదితర రాష్టాల నుంచి స్థానిక వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా మార్కెట్లో ధరలు పెరుగుతుంటాయి. ప్రస్తుతం అక్కడ కూడా వర్షాలు లేక పంటలు సరిగా పండకపోవడంతో కొరత ఏర్పడింది. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో చూస్తుండగానే ధరలు అమాంతం పెరిగాయి.
వినియోగదారు: అమ్మా.. టమాట కావాలి? కేజీ ఎంత?
విక్రయదారు: కేజీ రూ.100.
వినియోగదారు: అమ్మో.. అంత ధరా? మొన్న కొన్నప్పుడు రూ.50 కూడా లేదు కదా. కాస్త కొనే రేటు చెప్పు?
విక్రయదారు: కొనే ధర ఇంకోటేమీ లేదు. మీరు చెప్పేది మొన్నటి రేటు. నేను చెప్పేది ఈ రోజు రేటు. ఉన్న ధర ఒక్కటే. కేజీ రూ.100.
వినియోగదారు: ఇంత ధర అయితే టమాట ఏం కొంటాం. ఇక టమాట లేకుండానే కూర వండుకోవాలి.
విక్రయదారు: ధర అంతేనమ్మా.. కొంటే కొను. లేదంటే లేదు. 20 కేజీల టమాట బాక్స్ రూ.2,000 పడుతోంది. ఏమనుకుంటున్నావ్?
ఇదీ.. ఖమ్మం సమీకృత మార్కెట్లో మంగళవారం ఉదయం నాటి దృశ్యం.
టమాట మొన్న రూ.30.. ఇవాళ రూ.100
20 ఏళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. తొలకరి పడగానే మా చేలోనే కూరగాయలు, ఆకు కూరలు పండించి విక్రయిస్తుంటాను. మే నెల మధ్య వరకు మా పంటనే తెచ్చి మార్కెట్లోనూ, సంతల్లోనూ అమ్ముకుంటాం. కూరగాయలు అమ్మేటప్పుడు టమాట కచ్చితంగా ఉండాలి. అది లేకపోతే వ్యాపారం సాగదు. కానీ రేటు చూస్తే ఎక్కువగా ఉంది. కేజీ రూ.100కు పైగానే పలుకుతోంది. గత సోమవారం కేజీ టమాట హోల్సేల్గా మాకు రూ.25 పడింది. మేము రూ.30కి విక్రయించాం. కానీ ఈ సోమవారం కేజీ రూ.100కు అమ్మినా గిట్టుబాటు కావటం లేదు.
-జర్పుల రవి, ధర్మాతండా, కూసుమంచి