మధిర/ మామిళ్లగూడెం, డిసెంబర్13: రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్కుమార్ గుప్తా రైల్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి మధిర రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. తొలుత మధిర రైల్వేస్టేషన్ పరిశీలించారు. స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన షటిల్, వాలీబాల్ కోర్టులు, పిల్లల ఆటస్థలాన్ని ప్రారంభించారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి దిగే స్థలం ఎత్తుగా ఉందని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సరిచేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు.
స్టేషన్లలో ప్రయాణికులకు తాగునీటి వసతి కల్పించాలన్నారు. అనంతరం ఆయన మోటమర్రి రైల్వేస్టేషన్కు వెళ్లారు. పలు రికార్డులు పరిశీలించారు. ఖమ్మం చేరుకుని రైల్టేస్టేషన్లో ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఎక్సావేటర్స్ను పరిశీలించారు. మహిళా పోలీస్ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. డీఆర్ఎంను సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మధిర బ్రాంచ్ నాయకులు సన్మానించారు. కార్మికుల సమస్యలు పరిషరించాలని వినతిపత్రం అందజేశారు. పర్యటనలో రైల్వే ఎస్పీ డి.ఛటోపాధ్యాయ, ఏడీఈ ఎన్.అరుణ్కుమార్శర్మ, ఐవోడబ్ల్యూ శ్రీనివాసరావు, సీనియర్ డీఈఎన్ కృష్ణారెడ్డి, రైల్వేస్టేషన్ మేనేజర్ ప్రసాదరావు ఉన్నారు.
మధిర రైల్వేస్టేషన్లో నవజీవన్ ఎక్స్ప్రెస్ను నిలుపు చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం నాయకులు, మధిర సేవాసమితి సభ్యులు, వాసవిక్లబ్ స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మధిర స్టేషన్లో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్కుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి వెళ్లేటప్పుడు మధిర స్టేషన్లో పద్మావతి ఎక్స్ప్రెస్ ఆగుతున్నదని, కానీ తిరుగుప్రయాణంలో ఆగడం లేదన్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డోర్నకల్ -విజయవాడ ప్యాసింజర్ను పునరుద్ధరించాలని, లక్నో ఎక్స్ప్రెస్ను మధిరలో ఆపాలని కోరారు. మధిర రైల్వేఫ్లాట్ఫాంపై రైల్వే కోచ్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.