‘అసలే వర్షాకాలం.. ప్రతి రోజూ వానలు.. వీధులన్నీ బురదమయం.. సైడుకాలువలు, రోడ్ల వెంట చెత్త దుర్వాసన.. గంటల వ్యవధిలోనే దోమల పునరుత్పత్తి.. సీన్ కట్ చేస్తే..! డెంగీ, మలేరియా, చికున్గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి సీజనల్ జ్వరాలు విజృంభించడం.. ఊళ్లకు ఊళ్లు మంచం పట్టడం.. గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జరుగుతున్న తంతు ఇదే. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితులు మారాయి. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ సర్కార్ ప్రస్తుత తరుణంపై ప్రత్యేక దృష్టి సారించింది. సీజనల్గా వచ్చే అన్నిరకాల వ్యాధులను ఆదిలోనే తుద ముట్టించేందుకు జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా తీసుకుంటున్న చర్యలపై ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
– ఖమ్మం సిటీ, జూలై 26
ఖమ్మం సిటీ, జూలై 26 : ప్రస్తుత సీజన్లో తరుచుగా వర్షాలు పడుతుంటాయి. వాతావరణంలో సంభవించే మార్పుల కారణంగా దోమలు విపరీతంగా వృద్ధి చెంది రకరకాల రోగాలకు కారకాలుగా మారతాయి. ప్రతి ఏటా జరిగే సాధారణ తంతే అయినప్పటికీ ప్రజలు అనారోగ్య సమస్యలను తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం దోమకాటు కారణంగా వచ్చే డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్నాయి. వీటిల్లో ప్రధానమైనది డెంగీ జ్వరం. తేట నీటిపై ఆవాసం ఉండే టైగర్(ఎడిస్ ఈజిైప్టె) దోమకాటు వలన వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇవి పగటి పూట మాత్రమే దాడి చేస్తాయి. ఇంటి పరిసరాలు, ఇండ్లలో నిల్వ ఉన్న నీటిలో గుడ్ల(లార్వా)ను పెడతాయి. ఎప్పుడైతే దోమలు కుట్టి వైరస్ శరీరంలోకి వెళ్తుందో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కంటి లోపలి భాగంలో నొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరోచనాలు, శరీరం మీద దద్దుర్లు, చిగుళ్ల వెంట రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితోపాటు దీర్ఘకాలిక రోగాలున్న వారికి డెంగీ సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. బాధితులకు ఒక్కోసారి తెల్ల రక్తకణాలు (ప్లేట్లెట్స్) తగ్గిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. వందలో ఐదుగురికి మాత్రమే ఈ తరహాలో జరుగుతుంది.
వర్షాకాలం వచ్చిందంటే రకరకాల రోగాలు విజృంభిస్తుంటాయి. దోమలు, క్రిములు, కీటకాల వలన జలుబు, దగ్గు, సాధారణంతోపాటు విషజ్వరాలు, డయేరియా వంటి జబ్బులు ప్రతి గుమ్మాన్ని పలకరిస్తుంటాయి. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గత ఐదేళ్ల కాలంలో వెలుగులోకి వచ్చిన జబ్బులు, తీసుకున్న చర్యల గురించి ఆరా తీసింది. ప్రధానంగా ప్రాణాంతక డెంగీ జ్వరం వ్యాప్తి, నివారణ చర్యలపై దృష్టిసారించి దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి తన సిబ్బందితో రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలోకి మండలస్థాయి వైద్యాధికారులను, ప్రోగ్రాం ఆఫీసర్స్, సూపర్వైజర్స్ పంపించి ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు అందిస్తున్నారు. వారంరోజుల వ్యవధిలో నయంకాని వారి రక్త నమూనాలు సేకరించి డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి జ్వరాల వైద్య పరీక్షలు చేయిస్తున్నరు. దీనికిగాను ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎన్ఎస్ 1 ఎలీసా, ఐజీఎం ఎలీసా పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. తెల్ల రక్తకణాలు(ప్లేట్ లెట్స్) ఎక్కించేందుకు సైతం పెద్దాసుపత్రి బ్లడ్ బ్యాంక్లో సదుపాయాలను అందుబాటులో ఉంచారు. నయాపైసా ఖర్చు లేకుండా అన్నివర్గాల ప్రజలకు అద్భుతమైన సేవలను అందిస్తున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఈ ఏడాది 20 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితులకు చికిత్స అందిస్తూనే ఇండ్లలో, పరిసరాల్లో పైరిత్రం పిచికారీ చేయించి వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్శాఖలు సైతం అప్రమత్తమయ్యాయి. సర్పంచులు, వార్డుసభ్యులు, మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్ సహకారంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వాడవాడల్లో ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. సైడు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు. రహదారులపై చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు పాటిస్తూనే తమ సిబ్బందిని ఇంటింటికీ పంపిస్తూ వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. మంచినీటి పైపుల లీకేజీ సమస్య లేకుండా, నల్లాలు, చేతిపంపుల దగ్గర పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. హోటళ్లు, మాంసం మార్కెట్లు, దుకాణాలు, చిరుతిండి అమ్మే బండ్లపై నిఘా ఉంచి అంటువ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు. రహదారులపై మురికిగుంతలు లేకుండా చూస్తూ ఫాగింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్ వంటి ప్రక్రియలను కొనసాగిస్తున్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
డెంగీ నివారణ కోసం ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి పంచాయతీలో ఈ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు డీపీవో అప్పారావు జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులు(ఎంపీడీవోలు), మండల పంచాయతీ అధికారులకు(ఎంపీవోలు) దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. మండలాల వారీగా రోజువారీ నివేదికలు తెప్పించుకుని జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో డెంగీ, ఇతర జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా నిర్వహిస్తున్న చర్యలను మంత్రి పువ్వాడ, కలెక్టర్ వీపీ గౌతమ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇటీవలే ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినికి డెంగీ పాజిటివ్ అని తేలింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్, మేయర్ పునుకొల్లు నీరజ, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, అర్బన్ మలేరియా అధికారి వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బంది బాధిత మహిళ ఇంటికి వెళ్లి ప్రత్యేక పారిశుధ్య పనులను దగ్గరుండి జరిపించారు.