మధిర టౌన్, నవంబర్ 30 : ‘ఎయిడ్స్కు మందులేదు.. నివారణ ఒక్కటే మార్గం..’ అంటూ ప్రభుత్వ ప్రచారాన్ని అందిపుచ్చుకున్న ఓ ఆరోగ్య పర్యవేక్షకుడు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నాడు. ప్రాణాంత ఎయిడ్స్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ చైతన్యం కల్పిస్తున్నాడు మధిర పట్టణానికి చెందిన లంకా కొండయ్య. దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్.
ఆయన జానపద కళాకారుడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెచ్ఐవీ/ఎయిడ్స్ మహమ్మారిని అంతమొందించాలని, నూరేళ్లు సాగాల్సిన జీవితం ఎయిడ్స్ కారణంగా పాతికేళ్లకే ముగిస్తే కుటుంబాలన్ని కకావికలమవుతాయని వివరిస్తూ రెండు దశాబ్దాలుగా విస్తృత ప్రచారం చేస్తున్నాడు. సామాన్యుల కుటుంబాల్లో ఎయిడ్స్ మిగుల్చుతున్న విషాదాలను తాను నేర్చుకున్న జానపద కళారూపాల ద్వారా వివరిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకు సాగుతున్నాడు.
తీరక వేళలు, సెలవు దినాల్లో ప్రజల వద్దకే వెళ్లి ఎయిడ్స్ వల్ల కలిగే వినాశనాలను వివరించడాన్ని ప్రవృత్తిగా భుజానికెత్తుకున్నాడు. మెడలో రెడ్ రిబ్బన్ వేసుకొని, చేతిలో కరపత్రాలు, ప్రచార బ్యానర్లు పట్టుకొని జనసంచారమున్న ప్రదేశాలకు వెళ్లి కళారూపాల ద్వారా చైతన్యం కలిగిస్తూ ముందుకు సాగుతున్నాడు. 20 ఏళ్ల ఈయన ప్రయత్నానికి, కృషికి అనేక అవార్డులు అందివచ్చాయి. ఇందులో మధిర ఆశామిత్రగా వరించిన గోల్డ్మెడల్ ప్రత్యేకమైనది.