భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ అశ్వారావుపేట, సెప్టెంబర్ 3 : మాతా, శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రతి సంవత్సరం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిశీలనకు ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమం ద్వారా మాసోత్సవాలు నిర్వహిస్తున్నది. సెప్టెంబర్ మొదటివారం నుంచి నెలాఖరు వరకు ఐసీడీఎస్ నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నది. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై సూచనలివ్వడంతోపాటు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు అంచనా వేస్తుంటారు. జిల్లావ్యాప్తంగా 11 ప్రాజెక్టుల పరిధిలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 39,709 మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఉన్నారు.
తల్లీబిడ్డ ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు ఆరోగ్యం పట్ల స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సెప్టెంబర్లో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ మాసోత్సవాలు పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, చిన్నారుల ఆరోగ్యంపై ఐసీడీఎస్ అధికారులు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కార్యక్రమం ముఖ్యఉద్దేశం.
39,709 మందికి లబ్ధిదారులు
జిల్లావ్యాప్తంగా 11 ప్రాజెక్టుల పరిధిలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అశ్వారావుపేట పరిధిలో 132, బూర్గంపాడులో 158, చండ్రుగొండలో 160, చర్లలో 112, దమ్మపేటలో 237, దుమ్ముగూడెంలో 173, కొత్తగూడెంలో 216, మణుగూరులో 208, పాల్వంచలో 234, టేకులపల్లిలో 228, ఇల్లెందు పరిధిలో 202 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో గర్భిణులు 8,239, బాలింతలు 6,585, 3 నుంచి 6 ఏండ్లలోపు చిన్నారులు 24,885 మంది మొత్తం 39,709 మంది లబ్ధి పొందుతున్నారు.
పౌష్టికాహారం – ఉపయోగాలు
ప్రతి తల్లి పౌష్టికాహారం తీసుకుంటేనే పుట్టే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఇనుము, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, చిక్కుళ్లు, బెల్లం, ధాన్యాలు, ఖర్జూర, పండ్లు తీసుకోవాలి. ప్రాంతీయంగా దొరికే తాజా పండ్లు తీసుకుంటే ఎక్కువ మంచిది. పాలు, పెరుగు, గుడ్లు ఆహారంలో భాగంగానే తీసుకోవాలి. అయోడైజ్డ్ ఉప్పును వాడాలి. పండ్ల రసాలు, నీళ్లను ఎక్కువగా తాగాలి. కొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అంగన్వాడీలు అందించే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
బిడ్డకు పౌష్టికాహారం తల్లిపాలే…
బిడ్డకు మొదటి ఆరునెలలు తల్లిపాలే సంపూర్ణ పౌష్టికాహారం. తల్లిపాల నుంచి మాంసకృత్తులు, కొవ్వు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలు లభిస్తాయి. ఆరునెలలు దాటిన తర్వాత తల్లిపాలతోపాటు అదనపు ఆహారం తప్పనిసరి. ఆహారంలో గుజ్జుగా చేసిన పండ్లు, ఉడికించిన ఆకుకూరలు, ఇడ్లీ, ఉప్మా, పాలలో నానబెట్టిన రొట్టె, కిచిడీ, పాయసం, ఉడకబెట్టిన గుడ్డులో తెల్లసొన భాగం, ఉడకబెట్టిన పప్పు, నెయ్యి, చక్కెర మిశ్రమం ఇవ్వాలి. ఆరునెలలలోపు బిడ్డ ప్రతినెలా 600 నుంచి 800 గ్రాములు, ఏడునెలల నుంచి సంవత్సరంలోపు ప్రతినెల 300 నుంచి 400 గ్రాముల బరువు పెరగాలి. 7 నుంచి 9నెలల బిడ్డ సగం కప్పు ఆహారం మూడుసార్లు, పది నుంచి 12నెలల బిడ్డకు సగం కప్పు ఐదుసార్లు తల్లిపాలు కొనసాగిస్తూ ఉండాలి. సమయానికి తగు మోతాదుల్లో ఇచ్చే ఆహారం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.
మొదటివారం
మొదటి వారంరోజులపాటు పెరుగుదల పర్యవేక్షణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. చిన్నారుల బరువు, జబ్బ చుట్టుకొలత సేకరించడం, కొలతలను రిజిస్టర్లో నమోదు చేయడం, పిల్లల పెరుగుదలను పర్యవేక్షించడం, ఎన్హెచ్టీఎస్, పోషణ ట్రాకర్లో నమోదు చేస్తారు. చిన్నారులకు టీకాలు, గర్భిణులకు ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం, పోషకాహారం పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అనుబంధ పోషకాహార కార్యక్రమం, టేక్ హోం, రేషన్(టీహెచ్ఆర్), ఐరన్, కాల్షియం మాత్రలు పంపిణీ చేస్తారు.
రెండోవారం
చిన్నారుల బరువులను చెక్ చేయడం, పోషకాహారం కోసం పెరటితోటల పెంపకం చేపడతారు. విటమిన్-సీ అధికంగా ఉండే పండ్లతోటల పెంపకంపై అవగాహన కల్పిస్తారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని 5 ఏళ్ళలోపు పిల్లలందరి పెరుగుదలను పర్యవేక్షిస్తారు. గర్భిణులను నమోదు చేయడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కిషోర బాలికలకు రక్త పరీక్షలు చేయించడం, ఆరోగ్యం, పోషకాహార ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తారు.
మూడోవారం
చిన్నారులకు టీకాలు, గర్భిణులకు బరువు చూడడం, వైద్య పరీక్షలు చేయించడం, పోషకాహారం, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం, గర్భిణుల నమోదు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ర్యాలీలు, అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొనేలా సమన్వయం చేసుకుంటారు. పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నాల్గోవారం
పోషకాహారం తీసుకునేందుకు శుభ్రత పాటించడం, ఇతర విద్యార్థులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం ప్రార్థనలో పోషకాహారంపై రోజూవారీ సందేశాలు ఇవ్వడం, వ్యాసరచన పోటీలు, చేతుల శుభ్రతపై ప్రదర్శనలు చేయిస్తారు. గృహ సందర్శన చేసి పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తిస్తారు. చిన్నారులు, తల్లిదండ్రులను సంరక్షణ కేంద్రాలకు ఆహ్వానిస్తారు. పోషకాహార లోపంపై వివరించి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంల ద్వారా సూచనలు చేస్తారు.
నెలరోజులపాటు వారోత్సవాలు
నెలరోజులపాటు పౌష్టికాహార వారోత్సవాలను నిర్వహిస్తాము. ముందుగా సామ్, మామ్(బరువు తక్కువ, ఎక్కువ) పిల్లలను గుర్తించడం, గర్భిణులు, బాలింతలకు యోగా నేర్పించడం, మంచి ఆహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించడం ఉంటుంది. ప్రతి అంగన్వాడీ సెంటర్తోపాటు తల్లులు కూడా పెరట్లో న్యూట్రీగార్డెన్ పెంచేవిధంగా ప్రోత్సహిస్తున్నాం. సెక్టార్, ప్రాజెక్టు, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు జరుగుతాయి.
– సర్ణలత లెనీనా, డీడబ్ల్యూవో
తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యం
తల్లీబిడ్డ ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రతి ఏటా పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నది. నెలరోజులపాటు వివిధ కార్యక్రమాల ద్వారా తల్లులకు ఆరోగ్యం, పౌష్టికాహారం ఆవశ్యకతలపై అవగాహన కల్పిస్తాం. పోషకాహార లోపం నివారణ కార్యక్రమ ముఖ్యఉద్దేశం. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణుల నమోదు, సామూహిక సీమంతాలు, వైద్య పరీక్షలు, బాలింతలకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తాం. ఇతరశాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తాం.
– రోజారాణి, సీడీపీవో, అశ్వారావుపేట