కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ చేపట్టిన మూడో దశ సోలార్ విద్యుత్లో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం జూన్ నెలకల్లా పూర్తి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో బుధవారం సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులు, అధికారులతో సోలార్ విద్యుత్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త ప్లాంట్ల నిర్మాణాలపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ చేపట్టిన మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లలో ఇప్పటికే 224 మెగావాట్ల సామర్థ్యం గల తొమ్మిది ప్లాంట్లను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. మిగిలిన 76 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించి నిర్మించే ఐదు ప్లాంట్లను జూన్ నెలకల్లా పూర్తిచేసి, తెలంగాణ ట్రాన్స్కోకు అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. అంతకుముందు డైరెక్టర్ (ఈఅండ్ఎం) డీ సత్యనారాయణరావు నిర్మాణంలో ప్లాంట్ల గురించి సీఎండీకి వివరించారు.
అనంతరం సీఎండీ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో నేరుగా చర్చించారు. కాల పరిమితులు నిర్ణయించుకొని, రోజుకు రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టాలన్నారు. పూర్తయిన పనులకు వెంటవెంటనే బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు కంపెనీ తరుఫున అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై నిర్మాణ ఏజెన్సీలైన జెన్సోల్, ఎన్రిచ్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ.. నిర్ణీత గడువుకు ముందే నిర్మాణాలు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తాము సాయిల్ టెస్టింగ్, సర్వే పనులు పూర్తి చేశామని, నిర్మాణ ప్రాంతంలోని భూమిని చదును చేసి ఉంచామని వెల్లడించారు. సోలార్ ప్యానల్స్, ఇతర సామగ్రిని సమకూర్చుకుంటున్నామని వివరించారు.
జూన్ నెలకల్లా నిర్మాణం పూర్తి చేయాల్సిన వాటిలో కొత్తగూడెం ఏరియాలోని 22.5 మెగావాట్ల ప్లాంటు, అదే ఏరియాలో మరో 10.5 మెగావాట్ల ప్లాంట్, చెన్నూర్ 11 మెగావాట్ల ప్లాంట్, ఆర్జీ-3 ఏరియాలోని ఓపెన్కాస్టు-1 ఓవర్ బర్డెన్ డంపుపై 22 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నీటి జలాశయంపై ఇప్పటికే ప్రారంభించిన 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్తో పాటు అదే రిజర్వాయర్పై నిర్మించే మరో 10 మెగావాట్ల ప్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావుతో పాటు, జీఎం (కో-ఆర్డినేషన్) ఎం సురేశ్, జీఎం (పర్చేజ్) మల్లెల సుబ్బారావు, జీఎం (సోలార్) జానకీరామ్, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు, ఏజీఎం (ఫైనాన్స్) రాజేశ్వర్రావు, ఏజీఎం (పర్చేజ్) నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.