100 ఐసోలేషన్ బెడ్ల ఏర్పాటుకు భవనం పరిశీలన
స్పందించిన మంత్రి.. ఏర్పాట్ల కోసం అధికారులకు ఆదేశం
ఒక వైద్యుడు, ముగ్గురు వైద్య సహాయకుల కేటాయింపు
అశ్వారావుపేట, ఏప్రిల్ 27: కరోనా కల్లోలం నుంచి గిరిజనులు, గిరిజనేతరులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ప్రజలను కరోనా మహమ్మారి నుంచి రక్షణ కల్పించే దిశగా బాధితులకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్, భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డిలకు ఎమ్మెల్యే మెచ్చా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. గిరిజనుల ఆరోగ్యం దృష్ట్యా 100 ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి, కలెక్టరు స్పందించారు. వెంటనే ఐసోలేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు మంగళవారం అశ్వారావుపేటలో పర్యటించారు. ఐసోలేషన్కు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి పాత ఎంపీడీవో కార్యాలయం, గిరిజన భవన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 10 పడకలను 20 పడకలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించడానికి ఒక వైద్యుణ్ని, మరో ముగ్గురు వైద్య సహాయకులను కేటాయించారు. బాధితుల కోసం 50 సిలిండర్లను కేటాయించామని, రెండు రోజుల్లో ఆసుపత్రికి చేరుకుంటాయని చెప్పారు. 100 పడకల ఐసోలేషన్ ఏర్పాటుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అనుకూలంగా ఉందని చెప్పారు. నివేదికను కలెక్టర్కు, మంత్రికి అందజేస్తామని తెలిపారు.
మంత్రికి కృతజ్ఙతలు: ఎమ్మెల్యే మెచ్చా
తన విన్నపానికి స్పందించి 100 ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతులివ్వడం పట్ల మంత్రి అజయ్కుమార్, కలెక్టర్ ఎంవీ రెడ్డిలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.