మత్స్యకారులకు 100శాతం రాయితీపై చేప పిల్లలు..
75 శాతం రాయితీపై వాహనాలు అందజేత
భద్రాద్రి జిల్లాలో 5 వేల కుటుంబాలకు లబ్ధి
మత్స్య కార్మికుల జీవితాల్లో వెలుగులు
సుజాతనగర్, నవంబర్ 26: మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి.. ఉపాధి కోసం వలస వెళ్లిన ఆయా కుటుంబాలు తిరిగి సొంతూళ్లకు చేరుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడంతో వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నది. మత్స్యకార సొసైటీలను బలోపేతం చేసి.. అభివృద్ధికి బాటలు వేస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రభుత్వం 75 శాతం రాయితీపై ద్విచక్రవాహనాలు, వ్యాన్లను అందజేసింది. భద్రాద్రి జిల్లాలో 5 వేల కుటుంబాలు ఈ రాయితీలతో లబ్ధి పొందుతున్నాయి. అంతేకాదు ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం పట్టణాల్లో చేపల విక్రయానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. ఈ సారి జిల్లాలో 698 చెరువుల్లో మత్స్యశాఖ అధికారులు 1.79 కోట్ల చేప పిల్లల్ని వదిలారు. – సుజాతనగర్, నవంబర్ 26
చెరువుల్లో పెంచడానికి చేప పిల్లలు అందుబాటు లేక, ఒకవేళ చేప పిల్లలు దొరికినా వాటిని కొనే స్తోమత లేక, స్తోమత ఉన్నా మత్స్యకార సొసైటీ సభ్యుల మధ్య సఖ్యత లేక, చేప పిల్లలు చేతికి వచ్చిన తర్వాత వాటిని తరలించేందుకు వాహనాలు లేక ఇబ్బందులు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపింది తెలంగాణ ప్రభుత్వం. రాయితీలతో మత్స్యకారులకు మంచి రోజులు తీసుకొచ్చింది.. మత్స్యకార సొసైటీలను బలోపేతం చేసింది.. వారి అభివృద్ధికి బాటలు వేసింది.. భద్రాద్రి జిల్లాలో 5 వేల కుటుంబాలు రాయితీలతో లబ్ధి పొందుతున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్నాయి.
జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఇలా..
రాష్ట్రం ఏర్పడక ముందు మత్స్యకారులు ఎలాంటి అభివృద్ధి ఫలాలకు నోచుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆయా వృత్తుల వారికి రాయితీలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా మత్స్యకార్మిక సంఘాలనూ బలోపేతం చేశారు. ఏటా వందశాతం రాయితీపై చెరువులు, కుంటలకు చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు. చేపలు చేతికి వచ్చిన తర్వాత వాటిని విక్రయించడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మత్స్యకారులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై ద్విచక్రవాహనాలు, వ్యాన్లను అందజేసింది. ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం పట్టణాల్లో చేపల విక్రయం కోసం మార్కెట్లు ఏర్పాటు చేసింది. ఈసారి భద్రాద్రి జిల్లాలోని 698 చెరువుల్లో మత్స్యశాఖ అధికారులు 1.79 కోట్ల చేప పిల్లల్ని వదిలారు. చేప పిల్లల పెంపకం కోసం రూ.1.48 కోట్లను ఖర్చు చేశారు. మత్స్యకార కుటుంబాల కోసం గ్రామాల్లో కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ రాయితీలతో భద్రాద్రి జిల్లాలో సుమారు 5 వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. చేప పిల్లల ఉత్పత్తిని పెంచి మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం..
మత్స్యకారులకు రాయితీలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం. మత్స్యకారులు సర్కార్ రాయితీపై అందించే వాహనాలు తీసుకున్నారు. చెరువుల్లోకి చేప పిల్లలను 100శాతం రాయితీపై అందిస్తుండడంతో ఇబ్బందులు తప్పాయి. చేప పిల్లలు చేతికి వచ్చిన తర్వాత వాటి నుంచి మంచి ఆదాయం లభిస్తున్నది.