కూసుమంచి, జూన్ 5: స్వరాష్ట్రంలోనే విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ కృషి వల్లనే రాష్ట్రం చీకట్ల నుంచి వెలుగుల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు లేక చీకటి రాష్ట్రం అవుతుందన్న వారికి కనువిప్పు కలిగేలా తెలంగాణలో 24 గంటలూ విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పాలేరు గ్రామంలో ఏడీఈ కోక్యా నాయక్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ‘విద్యుత్ ప్రగతి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాళ మాట్లాడారు. నాడు నికరంగా రెండు గంటలపాటు కూడా వ్యవసాయానికి అందని విద్యుత్ నేడు సీఎం కేసీఆర్ కృషి వల్ల 24 గంటలూ అందుతోందని అన్నారు. విద్యుత్ సంస్కరణలతో తెలంగాణ ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు కరెంటు పోతే వార్త అయ్యే పరిస్థితులు ఉండేవని, తెలంగాణ వచ్చాక కరెంటు పోతే వార్త అయ్యే పరిస్థితులను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు.
చేతివృత్తుల వారికి వెన్నుదన్నుగా ఉండేందుకు ధోబీఘాట్లకు, సెలూన్లకు నెలకు 250 యూనిట్ల వరకూ ఉచిత్ విద్యుత్ను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. అలాగే నెలలో వంద యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీలకు కూడా ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని అన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో నేడు దాని అనేక రంగాలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని అన్నారు. వ్యవసాయం సహా గృహ అవసరాలకు నేడు 24 గంటలూ విద్యుత్ అందుతోందని అన్నారు. డీఈఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రూ.180 కోట్ల నిధులతో పాలేరు నియోజకవర్గంలో విద్యుత్రంగ అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు.
తెల్దారుపల్లి సర్పంచ్ సిద్దినేని కోటయ్య మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలు తీర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నుంచి డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, తిరుమలాయపాలెం ఎంపీపీ బోడా మంగీలాల్, బీరోలు ఏఈ శంకర్, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు వీరన్న, గ్రానైట్ పరిశ్రమల నుంచి వేముల రవికుమార్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఆత్మ చైర్మన్ రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఎంపీపీలు బాణోత్ శ్రీనివాస్, వజ్జా రమ్య, ఖమ్మం రూరల్ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ నంబూరి శాంత, సుడా డైరెక్టర్ గూడా సంజీవరెడ్డి, ఖమ్మం రూరల్ ఏడీఈ రామకృష్ణ, ఎంపీడీవో కరుణాకర్రెడ్డి, తహాసీల్దార్ మీనన్, ఏఈలు గ్రేసీ సుజన్, వెంకన్న, రైతుబంధు సమితి బాధ్యులు బానోత్ రాంకుమార్, శాఖమూరి సతీశ్, అక్కినపల్లి వెంకన్న పాల్గొన్నారు.