సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
తల్లాడ, మే 23 : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, కష్టకాలంలో కూడా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంగిదేవిపాడు సొసైటీలో సొసైటీ అధ్యక్షుడు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి జీలుగులు, పిల్లిపెసలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో 10వేల క్వింటాళ్ల జీలుగు, పిల్లిపెసలు, జనుము విత్తనాలు సొసైటీలకు అందించామన్నారు. వీటి విలువ రూ.6.76 కోట్లు ఉండగా సబ్సిడీ రూ.3.8 కోట్లు సబ్సిడీ విత్తనాల రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నారన్నారు. జిల్లాలో రైతుల నుంచి 2.45 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 1.25 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలిపామన్నారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఏ మాత్రం వెనుకాడటం లేదన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ రైతులు కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి పచ్చిరొట్ట విత్తనాలు వేయాలన్నారు. విచక్షణ రహితంగా క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా ఉండి భూసారాన్ని దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ యు.నరసింహారావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, సర్పంచ్ తూము శ్రీనివాసరావు, తల్లాడ సొసైటీ చైర్మన్ రెడ్డెం వీరమోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్లాల్, ఎంపీటీసీ బాణోతు మోహన్, కోపెల కనకయ్య, మువ్వా మురళీ, కేతినేని చలపతిరావు, కొండపల్లి చంద్రశేఖర్రావు, నాయుడు శ్రీనివాసరావు, సొసైటీ సీఈవో సరికొండ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.