పంట ఆరబోసుకునేందుకు సౌకర్యంగా కల్లాలు
భద్రాద్రి జిల్లాలో రూ.14 కోట్లతో 1,723 నిర్మాణాలు
ఇప్పటి వరకు 1,679 పూర్తి..
కల్లాల నిర్మాణంలో రాష్ట్రంలో నంబర్వన్ స్థానంలో భద్రాద్రి జిల్లా
కొత్తగూడెం, అక్టోబర్ 21 : పండించిన పంటను ఆరబోసుకునేందుకు ఒకప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. పంట కల్లాలు లేక ఆరుబయట, రహదారులు, వంతెనల మీద ఆరుబోసుకునే వారు. రైతన్నలకు ఇప్పుడు ఆ సమస్య లేదు. ధాన్యం, మిర్చి, ఇతర అపరాలు ఆరబోసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పంట కల్లాలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఎస్టీ, ఎస్సీ రైతులకు ఉచితంగా, బీసీలు, ఇతరులకు పదిశాతం భాగస్వామ్యంతో కల్లాలు నిర్మిస్తామని నిర్ణయించింది. దీంతో ముందుకొచ్చిన రైతులు ఉపాధి నిధులతో తమ చేనులోనే కల్లాలను నిర్మించుకున్నారు. ఇప్పుడు అవి వానొచ్చినా, గాలి దుమారం వచ్చినా ఎలాంటి నష్టం లేకుండా పంటను కాపాడుతున్నాయి. పండించిన పంటను రైతు నష్టపోకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రకాల సైజుల్లో కల్లాలు
రైతులకు వివిధ రకాల సైజుల్లో అధికారులు పంట కల్లాలను నిర్మించారు. వారికి ఉన్న స్థలం పరిధిలో 50, 60, 75 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టారు. 50అడుగులకు రూ.56 వేలు, 60అడుగులకు 68వేలు, 75అడుగులకు రూ.85 వేలను మంజూరు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికి రూ.10.32 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
నంబర్వన్ స్థానంలో జిల్లా
కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా అధికారులు పంట కల్లాలను వేగంగా పూర్తి చేశారు. దీంతో పంట కల్లాల నిర్మాణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నంబర్వన్ స్థానంలో నిలిచింది. గ్రామాల వారీగా ముందుకొచ్చిన రైతుల వివరాలు సేకరించిన వ్యవసాయాధికారులు జాబితాను సిద్ధం చేశారు. దరఖాస్తు చేసుకున్న 1,723 మంది రైతుల్లో ఇప్పటికే 1,679 నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మరో 44 నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి.
రాష్ట్రంలోనే మనమే నంబర్వన్
పంట కల్లాలను పూర్తి చేయడంలో రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నంబర్వన్ స్థానంలో నిలిచింది. వందశాతం పూర్తి చేసిన గుర్తింపు వచ్చింది. రూ.14 కోట్ల వ్యయంతో 1,723 కల్లాలు పూర్తిచేశాం. మరో 44 పూర్తికావొస్తున్నాయి. రైతులకు ఇవి చాలా ఉపయోగపడతాయి. వర్షం వస్తే ధాన్యం మీద పరదాలు వేసుకుంటే సరిపోతుంది. రైతులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
నాది చండ్రుగొండ మండలం తిప్పనపల్లి. వ్యవసాయం చేస్తున్నాను. అకాల వర్షాలు వస్తే పంట ఆరబోసుకోవడానికి కల్లాలు లేక ఇబ్బందులు పడేవాడిని. పొలాల్లో ధాన్యం ఆరబోస్తే అంతా మట్టిపాలయ్యేది. ఇక మిర్చి అయితే సరిగా ఆరక రంగు మారిపోయేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మా భూమిలోనే కల్లం కట్టించింది. ఇప్పుడు ఆ కల్లంలో మిర్చి, ధాన్యం ఆరబోసుకుంటున్నాను. వర్షం వస్తే పరదా కప్పుకుంటే చాలు ధాన్యం చెక్కుచెదరడం లేదు. మిర్చి రంగు అలాగే ఉంటోంది.
-అంచ కృష్ణ, రైతు