కరోనా బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలు
రూ.1.50 లక్షల విలువైన నిత్యావసరాల అందజేత
ఉచితంగా పౌష్టికాహారం, మినరల్ వాటర్ కూడా..
పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి, మే 19: కరోనా కారణంగా రక్త సంబంధీకులు కూడా దగ్గరకు రాని ఈ తరుణంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులకు అండగా ఉండడం, మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ వారి వద్దకే వెళ్లి సేవలు అందించడం అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లికి చెందిన ఫుడ్బ్యాంకు, నవచైతన్య అనే స్వచ్ఛంద సంస్థలు పేదలకు, కరోనా బాధితులకు విరివిగా సేవలందిస్తున్నాయని అన్నారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా దాతల నుంచి సేకరించిన రూ.1.50 లక్షల విలువైన నిత్యావసర సరుకులను బాధితులకు అందించాలని సూచిస్తూ ఆయా సంస్థల నిర్వాహకులు ఆషాఖాన్, గాదె నర్సింహారెడ్డిలకు ఎమ్మెల్యే సండ్ర బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ వీటితోపాటు సంస్థలు కూడా మరికొంత మొత్తాన్ని సమకూర్చి కరోనా బాధితులకు అందిస్తాయని అన్నారు.
సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 70 మంది కరోనా బాధితులు ఉండడంతో వారికి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పౌష్టికాహారం, మినరల్ వాటర్తోపాటు భోజనం అందిస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థల సేవలు అసమాన్యమని కొనియాడారు. కేసులు పెరిగితే కల్లూరులోనూ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి ఆహారాన్ని, మినరల్ వాటర్ను అందిస్తామన్నారు. నియోజకవర్గంలో రోజుకు 1000 కరోనా పరీక్షలు చేసేలా ఆసుపత్రుల్లో 10 వేల కరోనా కిట్లను తెప్పించి సిద్ధంగా ఉంచామన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు భోజనాన్ని అందజేశారు. ఏసీపీ వెంకటేశ్, డిప్యూటీ డీఎంహెచ్వో సీతారామ్, సీఐ రమాకాంత్, మున్సిపల్ చైర్మన్ మహేశ్, ఆత్మ చైర్మన్ హరికృష్ణారెడ్డి, నాయకులు దొడ్డా శంకర్రావు, మట్టా ప్రసాద్, రమేశ్రెడ్డి, బాలాజీరెడ్డి, గుండు ఉమ, మిరియం మధు పాల్గొన్నారు.