స్వగ్రామానికి నాలుగు మృతదేహాలు
కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు
మృతుల కుటుంబాలను పరామర్శించిన జడ్పీ చైర్మన్ లింగాల
ముదిగొండ, అక్టోబర్ 17: మండల పరిధిలోని బాణాపురం వద్ద శనివారం రాత్రి అమ్మవారి నిమజ్జనోత్సవానికి వెళ్లి వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి కమలాపురం గ్రామానికి చెందిన అవసాని ఉపేందర్ (25), బిచ్చాల ఎలగొండ స్వామి (55), ములకలపల్లి ఉమ (40), చోడబోయిన నాగరాజు (22) మృతిచెందిన సంగతి విదితమే. ఆదివారం పోస్ట్మార్టం తర్వాత నలుగురి మృతదేహాలు స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారు విలపించిన తీరు గ్రామస్తులను కన్నీరు పెట్టించింది. మృతుల్లో అవసాని ఉపేందర్ వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉపేందర్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఇంటి యజమాని మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బిచ్చాల ఎలగొండ స్వామికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబమంతా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నది. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ములకలపల్లి ఉమ భర్త కోటేశ్వరరావుతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నది. బతుకమ్మ వేడుకలు, దసరా పండుగకు అత్త ఇంటికి వచ్చిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. భార్య మృతిచెందడంతో కోటేశ్వరరావు బోరున విలపించాడు. చోడబోయిన నాగరాజు ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల తల్లి మరణించడంతో అన్నీ తండ్రే చూసుకుంటున్నాడు. ఇప్పుడు కుమారుడూ మృతిచెందడంతో తండ్రి గుండెలవిసేలా రోదించాడు. నలుగురి మృతితో కమలాపురం కన్నీటి సంద్రమైంది.
పలువురి సంతాపం
నలుగురి మృతిపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గ్రామానికి చెందిన నాయుకులతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. నాలుగు మృతదేహాలకు త్వరగా పోస్ట్మార్టం పూర్తి చేయాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ దుర్గ, నాయకులు తోట ధర్మారావు, వీరారెడ్డి, వెంకట్, ఎర్ర వెంకన్న, ఆదినారాయణరెడ్డి తదితరులున్నారు.