కొత్తగూడెం/ అశ్వారావుపేట/ అన్నపురెడ్డిపల్లి/ చండ్రుగొండ/ అశ్వారావుపేట టౌన్/ దమ్మపేట, మే 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజులుగా గాలిదుమారంతో కూడిన వర్షం కురుస్తోంది. గురువారం కూడా అశ్వారావుపేట, మణుగూరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో వర్షం కురిసింది. కొత్తగూడెం పట్టణంలో గాలిదుమారం రావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో దమ్మపేట, ములకలకపల్లి, చండ్రుగొండ మండలాల్లో భారీ వర్షం కురిసింది. నారంవారిగూడెంలో వడగండ్ల వాన పడింది. మణుగూరులో ఉదయం వర్షం కురిసింది. రైతులు ఆరబోసుకున్న ధాన్యం అక్కడక్కడా తడవడంతో కొన్ని చోట్ల రైతులు అప్రమత్తమై పంటపై పరదాలను కప్పుకున్నారు. ఇల్లెందులో గాలిదుమారంతో వాతావరణం చల్లబడింది.
పిడుగుపాటుకు యువకుడి మృతి
పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన చండ్రుగొండ మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని సీతాయిగూడెం గ్రామానికి చెందిన యువకుడు మలిపెద్ది రాజు (28) కుటుంబ సభ్యులతో కలిసి వంట చెరుకు కోసం అడవికి వెళ్లాడు. సాయంత్రం సమయం కావడంతో గాలితో కూడిన వాన ప్రారంభమవ్వడంతో వెంటనే కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లమని చెప్పాడు. వారు ముందుగా వెళ్లిపోయారు. అతను వంట చెరకును ఒక దగ్గరకు వేసి కొంత ఆలస్యంగా ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో వాన, గాలి తీవ్రతకు చెట్టు కిందకు వెళ్లాడు. అకస్మాత్తుగా పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు.