ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 2 : పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరుగనుంది. హిందీ పరీక్షకు అదనంగా 20 నిమిషాల సమయం కేటాయించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్ష జరుగనుంది. పరీక్షలకు రెగ్యులర్గా 16,872 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 101 రెగ్యులర్ కేంద్రాలు, 2 ప్రైవేట్ కేంద్రాలు, మొత్తంగా 103 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. సిట్టింగ్ స్క్వాడ్స్ 84మంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 6 గురు బృందాలతో పరీక్షలను పర్యవేక్షించనున్నారు. పరీక్షల కోసం ఇన్విజిలేటర్లుగా 2200 మందికి పైగా ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు.
సెల్ ఫోన్ అనుమతి లేదు…
పరీక్షలు జరుగుతున్న కేంద్రంలోకి ఇన్విజిలేటర్తో పాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ అధికారులతో సహా మొబైల్ పోన్లు వాడకూడదని స్పష్టం చేశా రు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోనున్నట్లు సీఎస్, డీవోల సమావేశంలో డీఈవో సూచించారు.
విద్యార్థులకు సకల సౌకర్యాలు…
విద్యార్థులు నేరుగా విద్యాశాఖ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను పొందేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో మెడికల్ సౌకర్యం అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లను, ఏఎన్ఎంను కేంద్రంలో అందుబాటులో ఉంచనున్నారు. కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్లైన్ నెంబర్ 8331851510లో ఫిర్యాదు చేసేలా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు.
విద్యాశాఖ ఎన్టీ బుక్స్ డైరెక్టర్ శ్రీనివాపాచారి పదవ తరగతి పరీక్షలకు జిల్లా అబ్జర్వర్గా విధులు నిర్వర్తించనున్నారు. పరీక్ష కేంద్రాల తనిఖీల ఫ్లయింగ్ స్క్వాడ్లు వారికి కేటాయించిన రూట్ల కనుగుణంగా తనిఖీలు చేయాలని డీఈవో సోమశేఖరశర్మ ఆదివారం ఓ సమావేశంలో సూచించారు. ఎలాంటి అవాంతరాలు ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఆదివారం నగరంలోని పలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. నిర్వాహకులతో జూమ్ సమావేశం నిర్వహించి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచనలు చేశారు.