రామవరం, మే 8 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్(జలగం వెంగళరావు) ఓపెన్కాస్టు.. బొగ్గు ఉత్పత్తిలో రారాజులా నిలుస్తున్నది. సింగరేణి వ్యాప్తంగా 18 ఓసీపీల్లో అధిక ఉత్పత్తి సాధించిన రికార్డును నెలకొల్పింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 నాటికి సంస్థ నిర్దేశించిన 100 లక్షల టన్నుల లక్ష్యాన్ని అధిగమించింది. ఒక రీజియన్కు సంబంధించిన బొగ్గును ఒక్క మైన్ నుంచే వెలికితీసి తన సత్తాచాటింది. ఉత్పత్తితో పాటు కార్మికులకు ఎలాంటి నష్టం కలుగకుండా రక్షణ చర్యలను పాటిస్తూ ‘0’ ప్రమాద రహిత ఓసీగా రికార్డు సాధించింది. అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ లక్ష్యాలను చేరుకున్నది.
అధికారుల ఆదేశాలు పాటించాం..
సంస్థ సీఅండ్ ఎండీ ఆదేశాలు, డైరెక్టర్ల పర్యవేక్షణ, ఏరియా జీఎం జక్కం రమేశ్ సలహాలు, సూచనలు పాటిస్తూ సమష్టి కృషితో లక్ష్యాలను సాధించాం. ఈ లక్ష్యసాధనను సుసాధ్యం చేసిన కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు, టెక్నికల్ సిబ్బందికి అభినందనలు. అధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ నెలవారీ ప్రణాళికల వారీగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం వల్లే 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలిగాం.
– ఎస్ వెంకటాచారి, ప్రాజెక్టు ఆఫీసర్, జేవీఆర్ ఓసీ