ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 22: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ఒక విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనవి. బంగారు భవిష్యత్తుకు బాటలు పడాలంటే ఎవరైనా మంచి మార్కులతో ఈ మజిలీ దాటాల్సిందే. జడ్పీ, కేజీబీవీ, సంక్షేమ, ఎయిడెడ్.. ఇలా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న విద్యాలయాల్లో ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. దీనిలో భాగంగా బుధవారం ఖమ్మంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వీపీ గౌతమ్ ఆయా పాఠశాలల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులను సమీక్షించనున్నారు. పదోతరగతి విద్యార్థులతోపాటు ఇతర తరగతుల విద్యార్థుల సామర్థ్యాల పైనా కలెక్టర్ చర్చించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకూ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు రాబట్టేందుకు అవసరమైన ప్రణాళికలను డీఈవో సోమశేఖరశర్మ ఇప్పటికే కలెక్టర్ వీపీ గౌతమ్కు నివేదికలు అందజేశారు. మరోవైపు పదోతరగతికి సంబంధించిన ఆరు సబ్జెక్టులు ఏడు పరీక్షలకు అనుగుణంగా సీసీఈ విధానంలోనే ప్రాక్టీస్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు నిర్వహించేలా ప్రశ్నాపత్రాల రూపకల్పనకు అడుగులు పడుతున్నాయి. అలాగే సర్కార్ పాఠశాలల్లో డిసెంబర్- 2024 ఎఫ్ఎల్ఎన్ నెలవారీ అచీవ్మెంట్ రిపోర్ట్, వర్క్బుక్స్, అభ్యాస దీపికలు, ఐఎఫ్పీఎస్, ఇతర డిజిటల్ రిసోర్సెస్ వినియోగం, ఇంగ్లిష్ మీడియం అమలుపై కలెక్టర్ సూచనలు ఇవ్వనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇటీవల జరిగిన సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్షల ఫలితాలను బేరీజు వేసుకుని ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షించనున్నారు. సిలబస్ ప్రకారం ఎస్ఏ-1 యూనిట్లు, పూర్తయిన సిలబస్, సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు వచ్చిన గ్రేడ్స్పై ప్రధానంగా చర్చ జరుగనున్నది. ఏ, బీ గ్రేడ్స్ సాధించిన విద్యార్థులు ఎలాగైనా ఉత్తీర్ణత సాధిస్తారు. సీ గ్రేడ్ సాధించిన విద్యార్థులూ కొంత సాధన చేస్తే ఉత్తీర్ణులవుతారు. ఇక తంటా అంతా డీ, ఈ గ్రేడ్ విద్యార్థులతోనే. వారు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుంది. సమీక్ష మొత్తం ఈ అంశాలపైనా జరుగనున్నది.