తెలంగాణ గాంధీ.. ముఖ్యమంత్రి కేసీఆర్
హరితహారం వల్లే వర్షాలు పెరుగుతున్నాయ్
పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
పెనుబల్లి, జూలై 4 : పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా చూపిస్తున్నారని, తెలంగాణ గాంధీ ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. మండలంలోని మండాలపాడు వైకుంఠధామాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎవెన్యూ ఫ్లాంటేషన్లో మొక్కలు నాటి, ఎస్సీ కాలనీలో తడిపొడి చెత్త బుట్టలను పంపిణీ చేసి, పెనుబల్లిలో ప్రతి పంచాయతీకి ఫాగింగ్ మిషన్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి ద్వారా పల్లెలు శుభ్రమవుతున్నాయని, హరితహారం ద్వారా వర్షాలు పెరుగుతున్నాయని, పల్లెలు ప్రశాంత వాతావరణానికి నిలయంగా మారుతున్నాయని అన్నారు. జడ్పీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ చెక్కిలాల మోహన్రావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, ఏఎంసీ ఛైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సోమరాజు రామప్ప, మండాలపాడు సర్పంచ్ తడికమళ్ల మంగమ్మ, ఎంపీటీసీ కాకాటి నిర్మలభారతి, మండల ప్రత్యేకాధికారి జే.జ్యోతి, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, తహసీల్దార్ ఎం.రమాదేవి, ఎంపీవో వాల్మీకి కిషోర్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దళితుల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్
దళితుల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండాలపాడు ఎస్సీ కాలనీలో సర్పంచ్ తడికమళ్ల మంగమ్మ అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన దళిత సాధికారిత సభలో ఆయన మాట్లాడారు. అనంతరం దళితవాడలో పాదయాత్ర చేశారు.