
అశ్వారావుపేట, అక్టోబర్ 19: ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ ఆయిల్పాం మిషన్’ పనులు వేగవంతంగా సాగుతున్నాయని ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు. రానున్న మూడేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని, వచ్చే ఏడాది 5 లక్షల ఎకరాల్లో విస్తరణ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. మండలంలోని నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయిల్పాం మొక్కల కొరతను నివారించేందుకు కొత్త నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాదికి 12 లక్షల మొక్కలను సిద్ధం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో టీఎస్ ఆయిల్ఫెడ్కు సాగు విస్తరణ కోసం కొత్తగా 1.15 లక్షల ఎకరాలను ఉద్యాన శాఖ కేటాయించిందన్నారు. ఈ ఏడాది 70 వేల ఎకరాల్లో కొత్త ప్లాంటేషన్ కోసం ప్రణాళిక సిద్ధం చేశామని, మిగతా 45 వేల ఎకరాలను మరో ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. భద్రాద్రి జిల్లాల్లో 25 వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగు విస్తరణపై దృష్టి సారించామని, ఇందుకోసం అశ్వారావుపేట, ఖమ్మం పరిసరాల్లో కొత్తగా రెండు నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గెలల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలతో చర్చిస్తున్నామని అన్నారు. ఆంధ్రా ప్రాంత రైతుల ఎఫ్ కోడ్లను రద్దు చేసి అక్రమ రవాణాకు చెక్ పెడతామన్నారు. ఫ్యాక్టరీల్లో గెలల దిగుమతికి ఎదురవుతున్న ఆలస్యాన్ని నివారించేందుకు కొత్త ప్లాట్ఫాంలు, వే బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, రైతులకు కనీస సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఆయిల్పాం విస్తరణ నేపథ్యంలో అవసరమైన ఉద్యోగాల భర్తీకి అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి, డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
మొక్కల ఉత్పత్తిలో నాణ్యత ఉండాలి
ఆయిల్పాం మొక్కల ఉత్పత్తిలో నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్దేశించిన మొక్కల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఎండీ సురేందర్ స్థానిక అధికారులను ఆదేశించారు. నర్సరీలో మొక్కల ఉత్పత్తిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కల రకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రైతు నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, తుమ్మా రాంబాబు, ఆళ్ల నాగేశ్వరరావు, తదితరులు వినతిపత్రం అందజేశారు.