ముదిగొండ, సెప్టెంబర్ 19: లిఫ్ట్ ఇచ్చిన ద్విచక్ర వాహనదారుడిని వెనుక నుంచి సూది మందు గుచ్చి హత్య చేశాడో గుర్తుతెలియని దుండగుడు. ఈ అనూహ్య ఘటన సోమవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని బాణాపురం గ్రామశివారులో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(55) సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయి గ్రామంలో ఉంటున్న కుమార్తె ఇంటికి బైక్పై బయల్దేరాడు. మార్గమధ్యంలో బాణాపురం శివారు వద్ద గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. జమాల్ బైక్ ఆపి ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడు. కొద్దిదూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో వెనుక నుంచి సూది గుచ్చి బైక్పై నుంచి దూకి అక్కడి నుంచి పరారయ్యాడు.
వెంటనే నోటి నుంచి నురగలు కక్కుతూ జమాల్ కింద పడిపోయాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు బాధితుడిని గమనించి వివరాలు అడుగగా గుర్తుతెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వగా సూదితో గుచ్చి పరారైనట్లు తెలిపాడు. జమాల్ను వారు వల్లభి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా జమాల్ సాహెబ్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతుడి ద్విచక్రవాహనంతోపాటు పక్కనే దొరికిన సిరంజిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల పోలీస్స్టేషన్లకు సమాచారం అందించి నిందితుడి కోసం గాలిస్తున్నారు. పలువురు అనుమానితులను ప్రశ్నించారు. కుక్కలను చంపే ఇంజెక్షన్తో చంపి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన వెనుక పాతకక్షలు ఉన్నాయా? ఎవరైనా కావాలని హత్య చేయించారా? వంటి భిన్న కోణాల్లో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.