కొత్తగూడెం, ఆగస్టు 24: భద్రాద్రి జిల్లాలో సాగు ఊపందుకున్నది. కురవడంతోవానలు దండిగా కురవడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. జిల్లాలోని 2,396 చెరువులు నిండాయి. వాతావరణం వరి సాగుకు అనుకూలంగా మారడంతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. కొన్నిచోట్ల మిర్చి నాట్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న రైతులు అపరాలు, నూనె గింజల సాగు కూడా చేపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సకాలంలో రైతుబంధు ఇవ్వడం, రుణమాఫీ అమలు చేయడంతో రైతులు దర్జాగా పంటలు సాగు చేసుకుంటున్నారు.
పెరిగిన పంటల అంచనా..
వ్యవసాయశాఖ ఇప్పటికే రైతులు పండించే పంటల అంచనాలను సిద్ధం చేసింది. గతేడాది మొత్తం 4,21,160 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఈఏడాది 4,61,850 ఎకరాల్లో రైతులు సాగు చేపట్టనున్నారు.జిల్లాలో డివిజన్ల వారీగా వ్యవసాయశాఖ అంచనాలను సిద్ధం చేయగా రైతులు ఇప్పటికే విస్తారంగా పత్తి, వరి సాగు చేస్తున్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండడంతో సాగు సాఫీగా సాగుతున్నది.
పంటల సాగు..
వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 4,61,850 ఎకరాల్లో రైతులు సాగు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 3,55,976 ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. దీని ప్రకారం సాగు 77శాతం పూర్తయింది. వరి 1,39,300 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 62,746 ఎకరాలు, జొన్నలు 31 ఎకరాలకు గాను 101 ఎకరాలు, మొక్కజొన్నలు 17,568 ఎరాలకు గాను 29,188 ఎకరాలు, కంది 44,500 ఎకరాలకు గాను 9,877 ఎకరాలు, పెసర 636 ఎకరాలకు గాను 545 ఎకరాలు, మినుములు 790 ఎకరాలకు గాను 84 ఎకరాలు, వేరుశెనగ 956 ఎకరాలకు గాను 188 ఎకరాలు, పత్తి 2,55,000 ఎకరాలకు గాను 2,52,684 ఎకరాలు, చెరుకు 462 ఎకరాలకు గాను 430 ఎకరాల్లో సాగవుతున్నది. ఇతర పంటలు 2,607 ఎకరాలకు గాను 154 ఎకరాల్లో సాగవుతున్నాయి.
పుష్కలంగా వానలు..
ఈ ఏడాది వానలు పుష్కలంగా కురవడంతో వర్షాధారంగా సాగు చేసే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూన్లో సాధారణ వర్షపాతం 144.8 మిల్లీ మీటర్లు కాగా 200.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్లో 128.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గతేడాది జూలైలో సాధారణ వర్షపాతం 328.9 మిల్లీ మీటర్లు కాగా 401 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది జూలైలో 449.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గతేడాది ఆగస్టులో సాధారణ వర్షపాతం 286.7 మిల్లీమీటర్లు కాగా 807.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈఏడాది ఆగస్టులో ఇప్పటివరకు 175.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటివరకు 151.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
అపరాలకు ప్రాధాన్యం
మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయశాఖ పంటల విస్తీర్ణం పెంచింది. వరి సాగును తగ్గించి అపరాలు, నూనె గింజలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నది. గతేడాది 1,73,044 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా ఈ ఏడాది 1,39,296 ఎకరాలకు తగ్గింది. అపరాలకు డిమాండ్ ఉండడంతో కందులు, వేరుశెనగ, మొక్కజొన్నకు రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతేడాది పత్తి 2,14,295 ఎకరాల్లో సాగు చేయగా ఈఏడాది 2,59,708 ఎకరాల్లో సాగు అవుతున్నది.
సాగు ఊపందుకున్నది..
రైతులకు వర్షాలు కలిసొచ్చాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరింది. సింగభూపాలెం చెరువు అలుగు పారుతున్నది. కిన్నెరసాని, తాలిపేరు, చండ్రుగొండ, అశ్వారావుపేట, ములకలపల్లి, మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లోని చెరువులు నిండాయి. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పాయి. వరినాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో పత్తి విస్తారంగా సాగవుతున్నది.
సరిపడా వర్షాలు కురిశాయి..
ఈ సారి పంటలకు సరిపడా వర్షాలు కురిశాయి. మా మండలంలోని సింగభూపాలెం చెరువులోకి పుష్కలంగా నీరు చేరింది. మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడ్డాయి. సాగునీటికి ఇబ్బంది లేదు. వ్యవసాయాధికారులు పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. రైతుబంధు అందింది. రుణమాఫీ జమ అయింది. ఎలాంటి రంది లేకుండా సాగు చేసుకుంటున్నాం.