మామిళ్లగూడెం, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అలసత్వం వహించొద్దని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. ఖమ్మంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం నర్సింహాపురం గ్రామంలో 30 మంది పేదలకు విద్యుత్ బిల్లులు రూ.వేలల్లో వచ్చాయని, అక్కడి లైన్మెన్ చేసిన తప్పిదానికి వినియోదారులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, వెంటనే వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. సమావేశానికి ఎస్ఈ రాకుండా ఏడీఈ స్థాయి అధికారిని పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామస్థాయిలో చెరువుల్లో మట్టిని రైతులు వ్యవసాయ వినియోగానికి తోలుకునేందుకు అనుమతులు కావాలన్నారు. ఈ అనుమతులు నీటి పారుదలశాఖ ఎస్ఈ స్థాయి నుంచి రావాలంటే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నందున డీఈఈ స్థాయి అధికారి అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గ్రామీణాభివృద్ధిపై సమీక్షించారు. తెలంగాణకు హరితహారం, ఉపాధి హామీ పనులు, ప్రణాళికలపై డీఆర్డీవో విద్యాచందన వివరించారు. పదోతరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఇబ్బందులు లేకుండా జాగ్రతలు తీసుకోవాలని జడ్జీ చైర్మన్ సూచించారు. ప్రతి ఒక్కరికి కరోనా టీకాలు వేయాలని వైద్య అధికారులకు సూచించారు. జిల్లాలో ఇంకా మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదని, వాటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
గ్రామాల్లో ఎక్కువగా అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కారుణ్య నియామకాల్లో పలువురు అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, జడ్పీటీసీలు ప్రియాంక, వరప్రసాద్, జగన్ తదితరులు పాల్గొన్నారు.