ఖమ్మం కల్చరల్, సెప్టెంబర్ 9: తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. గత నెల 31న భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రారంభమైన ఉత్సవాలు నిమజ్జన మహోత్సవంతో ముగుస్తాయి. సకల దేవతాగణాలకు అధిపతి అయిన గణనాథుడు సరస్వతి పూజలు, కుంకుమ పూజలు అందుకున్నాడు. ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారికి హోమాలు, అన్నదానాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న నదులు, వాగులు, చెరువులు, కాలువల్లో ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఉదయం మండపాల వద్ద పూజలు నిర్వహించి శోభాయాత్ర నిర్వహించనున్నారు. స్తంభాద్రి ఉత్సవ సమితి సభ్యులు నగరంలోని గాంధీచౌక్లో వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జన శోభాయాత్ర, గణేశ్ నిమజ్జన వీడ్కోలు సభ నిర్వహించనున్నారు. ప్రకాశ్నగర్, కాల్వొడ్డు మున్నేరు వద్ద క్రేన్ల సాయంతో నగరపాలక సంస్థ సిబ్బంది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ప్రకాశ్నగర్, మున్నేరు బ్రిడ్జిల వద్ద పోలీసులు ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర రూట్మ్యాప్ను సిద్ధం చేశారు. నిమజ్జన ఘాట్ల వద్ద అధికారులు క్రేన్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. నగరంలో జరిగే శోభాయాత్ర, సభలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పాల్గొననున్నారు.