కొత్తపల్లి, జూన్ 24 : పూర్వం రాజులు యు ద్ధంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు అనుసరించిన విధానాలతో పుట్టుకొచ్చిందే చదరంగం.. రానురాను క్రీడగా మారి విశ్వవ్యాప్తమై ఎందరికో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టగా, శనివారం కరీంనగరంలో ప్రారంభ మైన తెలంగాణ రాష్ట్ర ఓపెన్, అండర్-13 చదరంగ పోటీలకు విశేష స్పందన వచ్చింది. తెలంగాణ డెమాక్రటిక్ చెస్ డెవలప్మెంట్ కమిటీ (టీడీసీడీసీ) ఆధ్వర్యంలో నగరంలోని బైపాస్ రోడ్డులోని వీ కన్వెషన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ టో ర్నీని జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా, రాష్ట్ర నలుమూలల నుం చి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ మాట్లాడుతూ చదరంగం గొప్ప ఆలోచనా శక్తిని ఇస్తుందన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపకశక్తి పెరు గుతుందని చెప్పారు. మేధో సంపత్తికి చెందిన క్రీడ కావడంతో తన పిల్లలను సైతం చదరంగంలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, ఓడిపోతే కసి పెంచుకొని మళ్లీ గెలవడానికి ప్రయత్నించాలే గానీ, కుంగిపోవద్దని సూచించారు.
వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో దూరం నుంచి కరీంనగర్కు తీసుకువచ్చి పోటీల్లో ఆడిస్తుండడం అభినందనీయన్నారు. నేటి పోటీ పరిస్థితుల్లో పిల్లలకు చదువుతోపాటు క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పకుండా శిక్షణ ఇప్పించాలన్నారు. పోటీల నిర్వాహకులు జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్లు కంకటి అనూప్కుమార్, కంకటి అనూప్కుమార్ మాట్లాడుతూ చెస్ పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చిందని, సుమారు 31 జిల్లాల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు చెప్పారు. రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయని, విజేతలకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. టోర్నమెంట్కు సహకరించిన బిర్లా ఓపెన్ మైండ్స్ సూల్, వీ కన్వెన్షన్, వెంకట్ ఫౌండేషన్, సిద్ధార్థ సూల్, మల్టీ బైట్, సురభి ట్రావెల్స్, కిడ్స్ మాల్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సభ్యులు సమీ ర్, అమిత్ పాల్సింగ్, కంది రవి మాట్లాడుతూ చదరంగం రాజుల కాలం నుంచి కొనసాగుతుందని, ఈ క్రీడకు రాష్ట్రవ్యాప్తంగా విశేషంగా ఆదరణ రావడం సంతోషంగా ఉందన్నా రు. ఇక్కడ తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కే అనిత, ఆర్బిటర్లు పాల్గొన్నారు.
చెస్తో జ్ఞాపక శక్తి పెరిగింది
చెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ క్రీడతో నాలో జ్ఞాపకశక్తి బాగా పెరిగింది. నేను గత మూడేళ్లుగా చెస్లో శిక్షణ పొందుతున్న. ఈ క్రీడతో 3, 4వ తరగతిలో నేనే ఫస్ట్ వస్తున్నా. ఇదంతా చెస్ క్రీడతోనే సాధ్యమైంది. కరీంనగర్లో రాష్ట్రస్థాయి చదరంగ పోటీల్లో పాల్గొంటానంటే మా పేరెంట్స్ ఇక్కడికి తీసుకువచ్చారు. నేను ఇప్పటివరకు రెండు గేమ్లు ఆడా. రెండింటిలోనే విజయం సాధించా. చదువులో రాణించేందుకు చెస్లో పోటీపడుతూనే ఉంటా.
– శ్రీహిత, వరంగల్
పోటీ పడ్డ ప్రతిసారి గెలుపొందా
చెస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే ఇప్పటివరకు 50 టోర్నీల్లో పాల్గొని ప్రతిసారి ఏదో ఒక బహుమతి గెలుపొందా. ఇంటర్నేషనల్ స్థాయిలో విశ్వనాథన్ ఆనంద్ తరహాలో రాణించాలన్నదే నా కోరిక. ఇందుకోసం ప్రతి రోజూ శిక్షణ పొందుతున్నా. నా కంటే పెద్ద వయస్సు వారితోనే నేను ఎక్కువగా పోటీపడుతా. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని కట్టడి చేస్తుంటా. చదువుతో పాటు చదరంగంపై దృష్టిపెడుతున్నా. చెస్ ఆడితే మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది.
– ప్రణవాదిత్య, హైదరాబాద్
రెట్టింపు స్పందన
కరీంనగర్లో రాష్ట్రస్థాయి చదరంగ టోర్నమెంట్కు క్రీడాకారులతో పాటు చిన్నారుల నుంచి విశేష స్పందన వచ్చింది. అనుకున్న దానికంటే రెట్టింపు సంఖ్యలో క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. అండర్-13 విభాగంతో పాటు ఓపెన్ విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. ఆదివారంతో ఈ పోటీలు ముగియనున్నాయి. చదరంగంలో జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలో చాటిచెప్పేందుకే అకాడమీ ద్వారా వందలాది మందికి శిక్షణ ఇస్తున్నాం.
– కంకటి అనూప్కుమార్, టోర్నీ నిర్వాహకుడు