కొత్తపల్లి, ఫిబ్రవరి 8: బాలికలు ఆత్మరక్షణకు దోహదపడే జూడో లాంటి యుద్ధ క్రీడలో రాణించాలని జడ్పీ సీఈవో ప్రియాంక పిలుపునిచ్చారు. మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో స్థానిక మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, కెడెట్ జూడో చాంపియన్ షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
క్రీడా పోటీల్లో ఓటమి గెలుపునకు నాంది కావాలని సూచించారు. ప్రతి ఒకరూ క్రీడల ద్వారానే గెలుపోటములు నేర్చుకుంటారన్నారు. మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి జూడో పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులను ఈనెల 17వ తేదీ నుంచి చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు.
ఈ పోటీలకు తెలంగాణ వ్యాప్తంగా 19 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు, 100 మంది కోచ్లు, మేనేజర్లు, రెఫరీలు హాజరైనట్లు పేర్కొన్నారు. కాగా, కెడెట్ బాలబాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించిన మహబూబ్నగర్ జట్టు, ద్వితీయ చాంపియన్ షిప్ సాధించిన వరంగల్ అర్బన్ జట్టు, తృతీయ చాంపియన్ షిప్ సాధించిన కరీంనగర్ జట్లకు జడ్పీ సీఈవో ప్రియాంక ట్రోపీలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవోను మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సతరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యవజన క్రీడాశాఖ అధికారి కీర్తి రాజవీరు, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, బేస్ బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్ రెడ్డి, భారత జూడో సమాఖ్య కోశాధికారి కైలాస్ యాదవ్, జూడో సంఘం రాష్ట్ర కోశాధికారి బాలరాజు, మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతా రెడ్డి, జూడో సంఘం బాధ్యులు ఎల్వీ రమణ, సిలివేరి మహేందర్, పీఈటీలు, పీడీలు, కోచ్లు, మేనేజర్లు, టెక్నికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.