ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళల రాజకీయ ప్రాతినిథ్యం క్రమేణా పెరుగుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహిళాలోకం రాజకీయాలకు దూరంగా ఉంటూ వంటింటికే పరిమితమైంది. అయితే, తెలంగాణ సర్కారు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఒకనాడు రాజకీయపదవుల్లో మచ్చుకు కూడా కనిపించక పోగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ రిజర్వేషన్లు మహిళలకు కలిసి వచ్చాయి. అక్కడితో ఆగకుండా తెలంగాణ సర్కారు.. మార్కెట్ కమిటీల వంటి పదవుల్లోనూ ప్రత్యేక కోటా కేటాయిస్తోంది.
ఫలితంగా 1400 మంది అతివలు వివిధ పదవుల్లో కొనసాగుతుండగా, తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టిన ఉమెన్స్ బిల్లుకు ఆమోదం లభిస్తే ఈ సంఖ్య మరింత పెరుగనున్నది. చట్టసభల్లోనూ వీరి సంఖ్య పెరుగనుండగా, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మరింత రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత దేశ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమేణా పెరుగుతూ రాజకీయాలను శాసించేస్థాయికి చేరుతున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో 67.2 శాతం పురుషులు పోలింగ్లో పాల్గొంటే. స్త్రీలు కూడా దాదాపు అంతే 67 శాతం ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2004 ఎన్నికల్లో స్త్రీలకన్నా పురుషుల ఓటింగ్ 8.4 శాతం ఎక్కువగా నమోదైంది. 2014, 2018, 2019 ఎన్నికల్లోనూ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అదేపరిస్థితి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్, పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఓటింగ్ విషయంలో మహిళలు పోటీ పోడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పురుషులకన్నా.. మహిళల ఓటింగ్ అధికంగా ఉంది. అంటే.. మహిళల్లో చైతన్యం క్రమేపీ పెరుగుతోంది. అంతేకాదు.. తాజా ఓటరు జాబితాను పరిశీలిస్తే ఆరు నియోజకవర్గాల్లో పురుషులకన్నా. మహిళలే అత్యధికంగా ఉంటూ రాజకీయాలను శాసిస్తున్నారు.
చట్టసభల్లో ప్రాతినిథ్యం అంతంతే..
జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 లక్షలపై చిలుకు మహిళా ఓటర్లు ఉన్నారు. గతంతో పొల్చితే ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను సైతం ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నారు. ఆదినుంచి మహిళా ఓటర్ల సంఖ్య ఉమ్మడి జిల్లాలో అధికంగానే ఉన్నా.. వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి.
ప్రధానంగా చట్టసభలకు ఎన్నికవడంలో విఫలమయ్యారు. 1952 సాధారణ ఎన్నికల నుంచి పరిగణలోకి తీసుకుంటే.. శానసభలో అడుగుపెట్టింది నలుగురే.. కాగా పార్లమెంట్కు వెళ్లింది ఒక్కరు మాత్రమే. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా సుగుణకుమారి 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. లోక్సభకు ఎన్నికైన తొలి, చివరి మహిళా ఆమే కావడం గమనార్హం. ఎమ్మెల్యేలుగా జేఎం. రాజమణి దేవి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1952లో ఎన్నికయ్యారు. అలాగే ప్రేమలతాదేవి నుస్తులాపూర్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి 1972లో విజయం సాధించారు.
కొమిరెడ్డి జ్యోతి మెట్పల్లి నుంచి 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. బొడిగె శోభ చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం నుంచి 2014లో విజయం సాధించారు. వీరు మినహా చట్టసభల్లోకి ఎవరూ అడుగు పెట్టలేదు. అయితే.. స్థానిక సంస్థల్లో 50 శాతం కోటాతో మహిళలు రాజకీయరంగంలో ముందుకొస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల పరిధిలో 1299 మంది వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. వీరితో పాటుగా మరో వంద మంది వరకు.. వివిధ నామిటేడ్ పదవుల్లో ఉన్నారు.
మొత్తంగా చూస్తే.. 14 లక్షల మంది మహిళా ఓటర్లు ఉంటే.. 14 వందల మంది మహిళలు ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. అంటే ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ప్రతినిధి ఉన్నారు. భవిష్యత్లో ఈ సంఖ్య పెరగాలంటే.. మహిళలు రాజకీయాల్లో అత్యంత చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉందంటున్నరూ రాజకీయ విశ్లేషకులు. ఈనేపథ్యంలో.. భవిష్యత్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే అంశంపై మహిళాలోకం దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లు తొలిసారిగా 1996లో దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ, ఆమోదింపజేయడంలో విఫలమైంది. తదనంతరం 1998, 1999, 2002, 2003లో ఈ బిల్లును తిరిగి ప్రవేశ పెట్టినప్పటికీ పాస్ కాలేదు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ బిల్లుకు మద్దతు ప్రకటించినా ఇతర పార్టీలు సమ్మతించకపోవడంతో బిల్లు నిలిచిపోయింది. మొదటి బిల్లు ప్రవేశపెట్టిన తదుపరి 12 ఏండ్ల తర్వాత అంటే 2008లో బడ్జెట్ సమావేశాల్లో మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ సర్కారు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది.
రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో 2/3 వంతు మెజార్టీ అవసరం ఏర్పడ్డది. తర్వాత బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ అభిప్రాయానికి పంపించారు. కమిటీ కూడ తమ నివేదికలో బిల్లు అమోదం పొందాలని పేర్కొన్నారు. తరువాత 2010 మార్చిలో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్సభలో ఓటింగ్కు రాలేదు. 15వ లోక్సభ 2014లో రద్దు కావడంతో బిల్లు వీగిపోయింది. తిరిగి ప్రస్తుతం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే.. ఈ బిల్లు లోపభూయిష్టంగా ఉన్నదని, చిత్తశుద్ధితో ప్రవేశపెడితేనే మహిళలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ బుధవారం బహిరంగానే విమర్శలు గుప్పించారు.