Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మే19: ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా పాముకాటుకు గురై మహిళ మృతి చెందింది. ఈ సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వెన్నంపల్లి కి చెందిన పూసాల వజ్రమ్మ (69) సోమవారం సాయంత్రం ఇంటి ముందర వాకిలిని ఊడుస్తుండగా ఎడమకాలు బొటనవేలుపై ప్రమాదావశాత్తు నాగుపాము కాటువేసింది. వెంటనే ఇంటి పక్కన ఉన్న వారికి విషయం చెప్పింది. వారు పెద్దపల్లి లో ఉన్న కుమారుడు రమణాచారికి సమాచారమిచ్చారు.
హుటాహుటిన వజ్రమ్మను చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి మృతి చెందింది. మృతురాలి కుమారుడు రమణాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.