‘తలాపునా పారుతోంది గోదారీ.. నీ సేను నీ సెలుకా ఎడారీ.. రైతన్నా నీ బతుకూ.. అమాసా.. ఎన్టీపీసీ చూస్తోంది తమాషా..’ అంటూ నాడు అంతర్గాంకు చెందిన విప్లవ, ఉద్యమ కవి రచయిత మల్లావజ్జల సదాశివుడు రాసిన ఈ పాట రామగుండం ప్రాంతం కష్టాలు, కన్నీళ్లను కండ్లగట్టింది.
‘ఏ మున్నదక్కో.. ఏమున్నదక్కా.. ముల్లె సదురుకున్న ఎల్లిపోతావున్నా.. ఈ ఊళ్ల నాకింక ఏమున్నదక్కా..’ అంటూ ఆయన రాసిన మరోపాట ఆనాడు ఇక్కడ పారిశ్రామిక, వ్యవసాయం రంగం దెబ్బతిని, వలస బాటపట్టిన ప్రజల దయనీయ స్థితికి అద్దం పట్టింది.
పై రెండు పాటలు చాలు.. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నియోజకవర్గ దుస్థితిని తెలుపడానికి.. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అన్ని వనరులున్నా, నాటి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అన్నింటా వెనుకబడి పోయింది. పక్కనే గోదావరి పారుతున్నా భూములకు నీరందక.. పరిశ్రమలకు కరెంట్ లేక వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలు కాగా, ఎంతో మంది ఆగం కావాల్సి వచ్చింది. ఇంకా రోడ్లు, మౌలిక వసతుల జాడ లేక కనీస అభివృద్ధికి నోచుకోలేక పోయింది. కానీ, ఇయాళ ఈ పారిశ్రామిక ప్రాంతం ప్రగతికి కేరాఫ్లా మారింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తోడ్పాటు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషితో అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నిండు కుండలా మారగా, ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సింగరేణి కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగింది. రాష్ట్ర సర్కారు సింగరేణికి జీవం పోయడంతోపాటు కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేసింది. హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన ఇండస్ట్రియల్, ఐటీ పార్క్లకు ఇక్కడ పునాది రాయి వేసింది.
పెద్దపల్లి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్లా మారింది. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో వేల కోట్ల నిధులతో ప్రగతి పరుగులు పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, మంత్రి కేటీఆర్ తోడ్పాటు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషితో ఆదర్శంగా నిలుస్తున్నది. సింగరేణి బొగ్గు పరిశ్రమతోపాటు దక్షిణ భారతదేశానికి వెలుగులు అందించే రామగుండం ఎన్టీపీసీ, రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) సంస్థలు ఒకవైపు.. సింగరేణి మెడికల్ కళాశాలతో వైద్య రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నది. ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు ప్రజా, కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఇటీవల మంత్రి కేటీఆర్ కోరుకంటి చందర్ను గెలిపిస్తే రామగుండంను దత్తత తీసుకుంటానని ప్రకటించడం, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం కానున్నది.
రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రామగుండం ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే చందర్ కృషి మేరకు సీఎం కేసీఆర్తోపాటు మంత్రి కేటీఆర్ తోడ్పాటునందించారు. పోలీస్ కమిషనరేట్, 500కోట్ల సింగరేణి నిధులతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. అలాగే ఈ కాలేజీలో 5శాతం సీట్లను ప్రత్యేకంగా సింగరేణి కార్మికులకు పిల్లలకు కేటాయించారు. అలాగే భోధనాసుపత్రిగా చేసి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చేశారు. ఇంకా రామగుండంను కార్పొరేషన్గా మార్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ కోర్టును ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండుకుండలా మారిన గోదావరి తీరాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చే పనిలో ఉన్నారు. కేవలం హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన ఇండస్ట్రియల్, ఐటీ పార్క్లకు అంతర్గాం, రామగుండంలో పునాది రాయి వేశారు.
తెలంగాణ రాక ముందు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియోజకవర్గంలో వందల కోట్ల నిధులతో రవాణా సదుపాయాలను మెరుగు పరిచారు. అంతర్గాం వద్ద గోదావరినదిపై 125కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అనేక ఏండ్లుగా పెండింగ్లో ఉన్న రాజీవ్ రహదారి కుందనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించి, 10కోట్లతో పనులు చేస్తున్నారు. 350కోట్ల నిధులతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ది పనులు చేస్తున్నారు. 10కోట్ల సింగరేణి నిధులతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ నుంచి ఫైవ్ ఇంక్లయిన్ చౌరస్తా వరకు ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తి చేశారు.
రాజీవ్ రహదారిపై ప్రమాధాల నివారణ కోసం డీఎంఎఫ్టీ నిధులతో ఇరువైపులా 3.5కోట్లతో సర్వీస్ రోడ్ల నిర్మాణం, 2.94కోట్లతో డివిజన్లోసీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మాణాలను పూర్తి చేశారు. విద్యా, ఆరోగ్యం, శానిటేషన్, రోడ్డు నిర్మాణం కోసం ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల ద్వారా 2021-22లో 4కోట్లు, 2022-23లో 5.5కోట్లతో పనులు ప్రారంభించారు. 2.3కోట్ల సింగరేణి సీఎస్సాఆర్ నిధులతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు వేశారు. 40లక్షల కార్పొరేషన్ నిధులతో ఎల్బీ నగర్ నుంచి రమేశ్నగర్వరకు ప్రధాన రోడ్డు పనులు పూర్తి చేశారు. పోతన కాలనీ వద్ద బ్రిడ్జి నిర్మించి, యైటింక్లయిన్కాలనీ ప్రజల ఇబ్బందులు తీర్చారు. 3.5కోట్ల పట్టణ ప్రగతి నిధులతో కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లను సుందరీకరించారు.
సింగరేణి ప్రాంతంలో స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 76 ఇచ్చి దశాబ్దాల సమస్యను పరిష్కరించారు. పారిశ్రామిక ప్రాంతవాసుల్లో వెలుగులు నింపారు. అంతర్గాం మండలం పెద్దంపేట్, రాయదండి గ్రామాల పరిధిలో ఆరు దశాబ్ధాల ఖురూజ్కమ్మీ భూముల సమస్యను పరిష్కరించి, 1800 మందికి పట్టాలు ఇచ్చారు. అలాగే మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించడానికి వీ హబ్ ద్వారా రామగుండంలో 64 మందికి బ్యాంకుల ద్వారా 4కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటగా రామగుండంలోనే అమలు చేశారు. నియోజకవర్గంలో రూరల్ ప్రాంతానికి 28కోట్ల 50లక్షలతో 570 డబుల్ బెడ్రూం ఇండ్లు, మల్కాపూర్లో 41కోట్ల 50లక్షలతో అర్బన్ ప్రాంతానికి 670 డబుల్ బెడ్రూం ఇండ్లు, ఫైవ్ ఇంక్లయిన్ వద్ద 160 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నారు.
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు సింగరేణి సంస్థకు జీవం పోసి, కార్మికులకు గొప్ప గొప్ప వరాలనిచ్చి ఆదుకున్నారు. నేలతల్లి ఒడిలో ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడే కార్మికులను కపుడులో పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పెద్దన్నపాత్రను పోషించారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలకు ఒకే ఒక్క సంతకంతో గ్రీన్సిగ్నల్ ఇచ్చి, సింగరేణి చరిత్రలోనే మొదటిసారిగా 3200 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 19వేల కారుణ్య నియామకాలను చేపట్టారు. ఉద్యోగం వద్దనుకుంటే 25లక్షల బెనిఫిట్ స్కీంను అమలు చేస్తున్నారు.
తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని సైతం ఉచితంగా అందిస్తున్నారు. మహిళా కార్మికులకు మెటర్నిటీ లీవ్ను 3 నెలల నుంచి 6నెలలకు పెంచారు. 2 సంవత్సరాల పాటు చైల్డ్కేర్ లీవ్ను అమలు చేస్తున్నారు. కార్మికుల పిల్లలు ఐఐటీ, ఐఐఎం చదివితే పిల్లల ట్యూషన్ ఫీజును ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా తిరిగి చెల్లిస్తున్నారు. సింగరేణి కార్మికులు తమ క్వార్టర్లలో ఏసీని వినియోగిస్తే కరెంటు చార్జీలను పూర్తిగా లేకుండా చేశారు. వేతనంతో కూడిన రెండు హాలీడేలను అమలు చేస్తున్నారు. కార్మికుడు 10లక్షల వరకు ఇంటి రుణం తీసుకుంటే దానికి కార్మికుడు కట్టే వడ్డీని సింగరేణి సంస్థ తిరిగి చెల్లించే విధంగా చర్యలు చేపట్టారు. 2014వరకు ఉన్న లాభాల వాటా 18శాతంను 2023వరకు 32శాతానికి పెంచారు. సకల జనుల సమ్మె కాలంకు తెలంగాణ ఇంక్రిమెంట్గా వేతనాలను చెల్లించారు.
వృత్తిపన్నును శాశ్వతంగా రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. జాతీయ సంఘాల ఒప్పందం ప్రకారం బేసిక్ పే పై 1శాతం రికవరీని రద్దు చేశారు. దీంతో సఘటున కార్మికుడికి వెయ్యి వరకు ఆదా అవుతున్నది. మైన్ యాక్సిడెంట్ ప్రమాద మృతులకు 20లక్షల బీమా అందిస్తున్నారు. డ్యూటీలో కార్మికుడు ఏ కారణం చేతైనా మరణిస్తే 15లక్షల మ్యాచింగ్ గ్రాంట్ను ఇస్తున్నారు. మహిళా కార్మికులు, కార్మికుల కూతుర్లకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. పెళ్లి కాని వారికి, పెళ్లయి భర్తతో ఉన్నవారికి, భర్త చనిపోయినా, విడాకులు తీసుకున్న వారికి, విడాకులు పొందకుండా ఒంటరి మహిళగా ఉన్న వారికి, వైక్యం ఉన్న వారికి కూడా ఉద్యోగాలను ఇస్తున్నారు. డిస్మిస్డ్ కార్మికులకు మూడు సార్లు అవకాశం ఇస్తున్నారు. రిటైర్మెంట్ వయసును 60నుంచి 61ఏళ్లకు పెంచారు. ఇలా సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రేమను కురిపిస్తూ ఒకవైపు సంస్థను లాభాల బాటలో పయనింపజేస్తూనే కార్మికులకు గొప్పగా ప్రయోజనం చేకూరుస్తున్నారు.