హుస్నాబాద్, నవంబర్ 8: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి విజయం సాధిస్తానని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హుస్నాబాద్లోని ఐవోసీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం తో 2014, 2018లో భారీ మెజార్టీతో గెలుపొందానని, సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ సహకారంతో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తెచ్చి రోడ్లు, డ్రైనేజీలు, వివిధ భవనాలు, గ్రామాల్లో సౌకర్యాలు కల్పించానని, రాబోయే రోజుల్లో నూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన వేలా ది ప్రజలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్,
హుస్నాబాద్ నియోజకవర్గంపై సంపూర్ణ అవగాహన ఉన్న సతీశ్కుమార్ను ప్రజలు గెలిపించుకోవాలి. సతీశ్కుమార్ చేసిన నిరంతర కృషితోనే అరవై ఏండ్లనాటి కల అయిన గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయింది. తెలంగాణ ఉద్యమంలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుటుంబం పాత్ర ఎంతో కీలకమైంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన సతీశ్కుమార్కు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నది. గౌరవెల్లి ద్వారా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు సాగునీరందగా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు మిడ్మానేరు ద్వారా, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు దేవాదుల ద్వారా సాగునీరందుతుంది. రాబోయే రోజుల్లో నియోజకవర్గం పాడిపంటలతో కళకళలాడుతుంది. ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్-నాందేడ్ హైవే నిర్మాణంతో హుస్నాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడంతో పాటు సతీశ్కుమార్కు హ్యాట్రిక్ విజయం అందించాలి.
తెలంగాణ రాష్ట్రం గడిచిన పదేండ్లలో అసాధారణ ప్రగతిని సాధించింది. సీఎం కేసీఆర్ విజన్, అనుభవం రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలబెట్టింది. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తేవడంతోపాటు పదేండ్లలో ఎంతో ప్రగతిని సాధించిన సీఎం కేసీఆర్కే రాష్ర్టాన్ని పాలించే అర్హత ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుర్చీల కొట్లాట తప్ప అభివృద్ధి ఉండదు. రాష్ట్రంలో బీజేపీ అడ్రస్ గల్లంతయింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారి పెత్తనం మనకు అవసరం లేదు. మన సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకుందాం. హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే సతీశ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
– ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ మంత్రి