జగిత్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ)/మల్యాల/కొడిమ్యాల/ధర్మపురి: జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కొండగట్టు, ధర్మపురిలో పర్యటించారు. ముందుగా కొండగట్టుకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి ప్రధాన ఆలయంలో స్వామివారికి పూజలు చేయించారు. తర్వాత వెంకటేశ్వరస్వామి ఆలయం, లక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు.
అనంతరం ఆలయ ప్రాకార మండపంలో స్వామివారి చిత్రపటంతో పాటు, స్వామి వారి శేష వస్ర్తాన్ని పవన్ కళ్యాణ్కు అందజేసి, ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. తర్వాత జనసేన ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వారాహి ప్రచార రథానికి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో పవన్ కళ్యాణ్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జనసేన నాయకులతో కొండగట్టు సమీపంలో ఉన్న బృందావనం గార్డెన్లో అరగంట పాటు సమావేశమయ్యారు.