నేతన్న సంక్షేమానికి అహర్నిశలూ కృషిచేస్తున్న రాష్ట్ర సర్కారు అనేక పథకాలతో అండగా నిలుస్తున్నది. నాడు దిక్కూమొక్కూలేక ఆగమైన బతుకులకు స్వరాష్ట్రంలో భరోసా కల్పిస్తున్నది. ఇప్పటికే చేతినిండా పని, పనికి తగ్గ వేతనం వచ్చేలా బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లు ఇస్తూ, అందులో పదిశాతం యారన్ సబ్సిడీ నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేస్తున్నది. గతంలో కేంద్రం నిలిపివేసిన త్రిఫ్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ చొరవతో పునరుద్ధరించి, జీవితాలకు భరోసానిస్తున్నది. కార్మికుడు చేసిన పొదుపునకు సగం డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తుండడం, అందులో చేరినవారికే ‘నేతన్న బీమా’ వర్తించనుండగా, పథకానికి దరఖాస్తుల వెల్లువ కొనసాగుతున్నది.
రాజన్న సిరిసిల్ల, జూలై 22 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొన్న వస్త్రపరిశ్రమకు తెలంగాణ సర్కా రు జీవం పోసింది. మరమగ్గాల కార్మికులకు కోటి బతుకమ్మ చీరల ఆర్డర్లతో చేతినిండా ప ని, పనికి తగ్గ వేతనం వచ్చేలా చేసింది. అంతే కాకుండా బతుకమ్మ చీరెలకు వినియోగించే నూలుపై పదిశాతం రాయితీ ప్రకటించి ఆ డ బ్బులు సైతం కార్మికుల ఖాతాల్లో జమచేస్తున్న ది. ఆ పైసలు వృథాగా ఖర్చు చేయకుండా చేనే త, మరమగ్గాల కార్మికుల కోసం ప్రత్యేకంగా త్రిఫ్ట్ పథకాన్ని 2017లో ప్రవేశపెట్టగా, వేలాది మంది కార్మికులకు లబ్ధి చేకూరుతున్నది.
పొదుపుతో మదుపు
చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 2017లో ప్రారంభించిన ఈ పథకం రాష్ట్రంలోని కార్మికులందరికీ వర్తింపజేసింది. అందు లో భాగంగా సిరిసిల్లలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు అమలు చేసి, అందులో చేరే విధంగా చేనేత, జౌళిశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిపై అవగాహన లేక కొంత మంది కార్మికులే చేరి లబ్ధి పొందారు. కార్మికుడు రూ.8 చెల్లిస్తే అందుకు ప్రభుత్వం మరో రూ.8 కలిపి బ్యాంకులో జమ చేస్తున్నది. ఈ పథకానికి 36 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. రెండేళ్ల క్రితం కరోనా కష్టకాలంలో వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతపడింది.
ఉపాధి కోల్పోయిన కార్మికులకు పొట్ట గడవడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో రెండేళ్లు మాత్రమే పొదుపు చేసిన కార్మికులందరికి వారు జమ చేసిన డబ్బుకు సగం సర్కారు చెల్లించిన డబ్బు లు బ్యాంకుల నుంచి ఇప్పించింది. పొదుపు కాల పరిమితి మూడేళ్లున్నప్పటికి, రెండేళ్లు చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించింది. కార్మికులు రూ. రెండున్నర కోట్లు జమచేస్తే అందుకు మరో రూ.రెండున్నర కోట్లు ప్రభుత్వం కలిపి మొత్తం రూ.5కోట్లు కార్మికులకు చెల్లించి 2021 లో ఆపత్కాలంలో అండగా నిలిచింది. ఒక్కో కార్మికుడికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు నగదు వచ్చాయి. అందులో చాలా మంది కార్మికులు తమ బిడ్డల వివాహాలు, ఇంటి నిర్మాణాలకు వినియోగించారు. ప్రభుత్వం కల్పించిన ఈ పొదుపు పథకంతో లబ్ధిపొందిన వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
త్రిఫ్ట్ పథకానికి దరఖాస్తుల వెల్లువ
తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం అమలు చేసిన పొదుపు (త్రిఫ్టు) పథకంలో చేరేందుకు కార్మికులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో కార్మికులకు మాత్రమే వర్తించిన త్రిఫ్ట్ పథకం అమాత్యుడు కేటీఆర్ చొరవతో కార్మికులతో పాటు ఆసాములకు వర్తించేలా చర్యలు తీసుకోవడంతో దరఖాస్తుల వెల్లువ కొనసాగుతున్నది. 2017లో పునఃప్రారంభించిన స్కీంలో మొదట్లో కేవలం 1500 మంది మాత్రమే సభ్యత్వం తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో చేనేత జౌళిశాఖ అధికారులు కార్మిక కుటుంబాలకు అవగాహన కల్పించడంతో పెద్ద సంఖ్యలో చేరేందుకు ముందుకొస్తున్నారు. రెండు నెలల కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన చేనేత జౌళిశాఖకు ఇప్పటివరకు 6వేల అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలతో గడువు ముగుస్తుండగా, మరి కొద్ది రోజులు పొడిగించాలని కార్మికుల నుంచి డిమాండ్ వస్తున్నది. కార్మికుల డిమాండ్ మేరకు చేనేత జౌళిశాఖ ప్రధాన కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలిపారు. పొదుపు పథకంలో చేరిన కార్మికులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్, ఇండియన్ బ్యాంక్లు ఖాతాలు ఇచ్చాయి. వీటిలో ఖాతాలు తెరిచి పొదుపు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
పొదుపుతో పాటే బీమా సౌకర్యం
నేతన్నల కోసం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ పథకం సత్ఫలితాలిస్తున్నది. ఏదైనా కారణాలతో కార్మికుడు చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడుతుండగా, పరిస్థితిని చూసి మంత్రి కేటీఆర్ చలించిపోయారు. రైతులకు ప్రభుత్వం కల్పించిన రైతుబీమా మాదిరిగా నేతన్నలకు రైతు బీమా సౌకర్యం కల్పించారు. ప్రతి కార్మికుడికి రూ. 5లక్షలు బీమా పాలసీ ప్రభుత్వమే చేయించింది. కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5లక్షలు ఎల్ఐసీ సంస్థ చెల్లిస్తున్నది. బీమా వర్తించాలంటే కార్మికులు త్రిఫ్ట్ పథకంలో చేరాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. కాగా, కార్మికులకు బహుళ ప్రయోజనాలు వర్తించేలా మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవడంతో నేతన్నలు సంబురపడుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. బతుకమ్మ చీరల నుంచి మొదలుకొని వారి జీవితాలకు భరోసా నిచ్చే బీమా లాంటి అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నది. త్రిఫ్ట్ పథకంలో చేరిన కార్మికులందరికీ రూ. 5లక్షల బీమా వర్తిస్తుంది. గతంలో పొదుపు పథకంలో చేరిన వారందరికి కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకున్నది. ఏడాది గడువుకు ముందే పొదుపు చేసిన పైసలు తిరిగి ఇప్పించింది. ఇంత మంచి పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి.
– మిట్టకోల సాగర్, చేనేత జౌళిశాఖజిల్లా అధికారి (రాజన్న సిరిసిల్ల)