నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్, ఫిబ్రవరి 8: కరీం‘నగరాన్ని’ అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 25, 12వ డివిజన్లలో మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, అభివృద్ధిలో నగరం రూపురేఖలను మార్చామన్నారు. సీఎం కేసీఆర్కు కరీంనగర్పై ఉన్న ప్రేమతో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయగా, నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిన్నరగా నగరంలోని అన్ని డివిజన్లకు రోజూ మంచినీటిని అందిస్తున్నామన్నారు. ఇదే ఉత్సాహంతో రాంపూర్, భగత్నగర్, హౌసింగ్బోర్డు కాలనీ రిజర్వాయర్ల పరిధిలో 24 గంటలు మంచినీరు సరఫరా చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. వీటి పరిధిలో విజయవంతమైతే నగరవ్యాప్తంగా 24 గంటల మంచినీటి సరఫరా అందిస్తామని పేర్కొన్నారు. నగరంలోని అన్ని చౌరస్తాలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించి, కేబుల్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. నగర ప్రజల ఆరోగ్యం కోసం అన్ని డివిజన్లలో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటితో పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా సమీకృత మార్కెట్ల నిర్మాణం కూడా చేపడుతున్నామన్నారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, కార్పొరేటర్లు ఎడ్ల సరిత-అశోక్, తోట రాములు, జయశ్రీ, కంసాల శ్రీనివాస్, స్థానిక నాయకులు, అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.