సారంగాపూర్, ఏప్రిల్18 : తక్కువ పెట్టుబడితో అరుదైన రకాల పుచ్చకాయ పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలస్తున్నాడు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువరైతు బండారి వెంకటేశ్. తనకున్న 9 ఎకరాల్లో తన భార్య బండారి విజయతో కలిసి గత పదేండ్లుగా సీజన్ల వారీగా పంటలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం మూడెకరాల్లో ఐదు రకాల సీడ్ తీసుకుని సాగు చేశాడు. ప్రస్తుతం కోత దశలో ఉండగా, వారం విడిచి వారం క్రాప్ తీస్తున్నాడు. వీటిని జగిత్యాల, హైదరాబాద్, రిలయన్స్, డీమార్ట్కు విక్రయిస్తున్నాడు. వీటితో పాటు మిగతా భూమిలో వివిధ రకాల కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. అంతే కాకుండా, వీటిని ‘రైతు టూ కస్టమర్’ అనే క్యాప్షన్ పెట్టుకుని ట్రాక్టర్లో తిరుగుతూ నేరుగా విక్రయిస్తున్నాడు.
మూడెకరాల పుచ్చకాయ సాగు కోసం రూ 82 వేలు ఖర్చు చేసి నానో కంపెనీలకు సంబంధించిన ఐదు రకాల సీడ్ కొనుగోలు చేశాడు. దున్నడం, కూలీలు, ఎరువులకు రూ.30 వేలు వెచ్చించాడు. మొత్తం రూ.1.12 లక్షలు పెట్టుబడి కాగా, ఇప్పటి వరకు వచ్చిన దిగుబడిని విక్రయించగా రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు రైతు వెంకటేశ్ చెబుతున్నాడు. ఎకరాల్లో కాకుండా 20-20 గుంటల చొప్పున పండించి నేరుగా మనమే మార్కెట్లో అమ్ముకుంటే అధిక లాభాలు పొందవచ్చని అంటున్నాడు. కస్టమర్లకు తక్కువ ధరకు నేరుగా అందించాలనే లక్ష్యంతో సోషల్ మీడియా వినియోగిస్తున్నానని చెబుతున్నాడు. ఈ అరుదైన రకాల వాటర్ మిలన్లను కలెక్టర్ యాస్మిన్ బాష, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్కు అందించినట్లు తెలిపాడు.
ఆరోహి : ఈ రకం పుచ్చకాయ పైన ఆకుపచ్చగా ఉండి లోపల పసుపు రంగులో ఉంటుంది. దీనిని షుగర్ ఉన్నవారు కూడా తినవచ్చని, షుగర్ను కంట్రోల్లో ఉంచుతుందని రైతు చెబుతున్నాడు.
విశాలి : ఈ రకం పైన పసుపు రంగులో ఉండి లోపల ఎర్రగా ఉంటుంది.
పుట్బాల్ : ఈ రకం కాయ పైన సారలతో ఉండి లోపల ఎర్రగా ఉంటుంది.
సూపర్ క్వీన్ : ఈ రకం పైన నలుపు రంగులో ఉండి లోపల ఎర్రగా ఉంటుంది.
మస్కు మిలన్ :ఈ రకం పైన, లోపల గోధుమ రంగులో ఉంటుంది.