వేములవాడ, జనవరి 29: వేములవాడ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో 10 రోజులపాటు నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్ శిక్షణ శిబిరం ముగిసింది. ఇందులో రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన 19 మంది క్రీడాకారుల(పురుషులు, మహిళల)కు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. క్రీడానిపుణులు మెళకువలను నేర్పించారు. ఫిబ్రవరి 2నుంచి అసోం రాష్ట్రంలో జరుగనున్న నేషనల్ గేమ్స్లో సత్తాచాటేలా మెరుగైన ట్రైనింగ్ ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 8వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు శిక్షణ ఇచ్చారు.
ఇందులో మెరుగైన 12 మంది చొప్పున క్రీడాకారులను (పురుషులు, మహిళలు) ఎంపిక చేశారు. ఈ మేరకు రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల రమేశ్బాబు, ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డి జాతీయస్థాయిలో పాల్గొనే క్రీడాజట్లను ప్రకటించారు. జాతీయపోటీల్లో సత్తాచాటి తెలంగాణ కీర్తిపతాకను ఎగురవేయాలని ఆకాంక్షించారు. ప్రతిభ చూపి పతకాలు సాధించిన జట్లకు రూ. లక్ష నజరానా ఇస్తామని చెప్పారు. కాగా, శిక్షణ పూర్తయిన నేపథ్యంలో పలువురు క్రీడాకారులు ‘నమస్తే’తో తమ అభిమతాన్ని పంచుకున్నారు.
ఎంపికైంది వీరే..
పురుషుల జట్టు: నంది యశ్వంత్ (కెప్టెన్), కృష్ణ చైతన్య, ఎస్కే అంజత్అలీ, పీ ప్రశాంత్,బీ గణేశ్, ఎం సచిన్ పిళై, జీ రాకేశ్, ఎన్. శివరాజ్, వీ.రోహిత్, కే .రమేశ్, ఎస్. శ్రీనాథ్, ఈ పవన్ కుమార్.
మహిళల జట్టు: కే.లావణ్య (కెప్టెన్), ఎం అక్షిత, ఎం సుమలత, కే సుప్రియ, డీ లావణ్య, పీ శ్రీ కృతి, కే శ్రావ్య, ఎస్జే షణ్ముఖ, ఎం.లావణ్య, పీ.రమ్య, ఆర్.భారతి. కోచ్లుగా బషీర్ద్దీన్, సీహెచ్. ప్రమీలలక్ష్మి వ్యవహరించున్నారు.
డెయిరీ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు..
జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు కరీనంగర్ డెయిరీ చైర్మన్ చెల్మడ రాజేశ్వర్ రావు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రక్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. పతకాలు సాధించి రాష్ట్రకీర్తిని నిలబెట్టాలని కోరారు.
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా..
10 సంవత్సరాలుగా వాలీబాల్ ఆడుతున్న. బీచ్ వాలీబాల్ విభాగంలో ఇప్పటికే థాయ్లాండ్, ఇండోనేషియాతోపాటు నాలుగు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న. మాకు ఇక్కడ మంచి మెళకువలు నేర్పించారు. మేం చేసే పొరపాట్లను సరిదిద్దారు. ఈ ట్రైనింగ్తో నేషనల్ గేమ్స్లో పతకం కొల్లగొడతామనే విశ్వాసం ఉన్నది.
– పీ కృష్ణ చైతన్య, గోల్డ్ మోడల్ వాలీబాల్ క్రీడాకారుడు (హైదరాబాద్ )
జాతీయ పోటీల్లో సత్తా చాటుతం..
గడిచిన తొమ్మిదేళ్లుగా వాలీబాల్ ఆడుతున్న. వేములవాడ కళాశాల గ్రౌండ్లో అన్ని వసతుల మధ్య మంచి శిక్షణ ఇచ్చారు. ఫిట్నెన్ను కాపాడునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు. జాతీయ పోటీల్లో మన జట్టు పతకం సాధించేలా తనవంతు కృషిచేస్తా.
-ఎం అక్షిత, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు (రంగారెడ్డి )
గౌహతిలో సత్తాచాటుతాం.
అండర్ 19 నుంచి సీనియర్స్ వరకు 12సార్లు జాతీయస్థాయిలో ఆడాను. అంతర్జాతీయంగా కూడా జరిగిన పలు మ్యాచ్లో పాల్గొన్నాను. ఇక్కడ ఇచ్చిన ట్రైనింగ్ అద్భుతంగా ఉన్నది.అండర్ 23వ జట్టు కెప్టెన్గా వ్వవహరించాను. ఈ సారి గౌహతిలో సత్తా చాటుతాం.
-నంది యశ్వంత్ కుమార్, రాష్ట్ర వాలీబాల్ జట్టు కెప్టెన్ (మహబుబ్ నగర్ )
క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇచ్చాం..
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 19 మంది చొప్పున (పురుషులు, మహిళలు) వాలీబాల్ క్రీడాకారులను ఎంపిక చేసినం. వీరికి క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇచ్చినం. ఇందులో ప్రతిభ చూపిన 12 మంది క్రీడాకరులతో కూడిన తుది జట్లను ప్రకటించినం. ఇందులో వివిధ స్థాయిల్లో బంగారు పతకాలు సాధించిన వారు ఉన్నారు. పారదర్శకంగా క్రీడాకారులను ఎంపిక చేసినం.
– గజ్జెల రమేశ్బాబు,రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు
కఠోర సాధన చేశారు..
గతంలో కంటే ఈ సారి శిక్షణ బాగా జరిగింది. 10 రోజుల పాటు క్రీడాకారిణులు కఠోర సాధన చేశారు. వారికి అనేక మెలకులు నేర్పించినం. ఫిజికల్ ఫిట్నెస్ను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినం. ఈ జట్టు కచ్చితంగా జాతీయపోటీల్లో పతకం సాధిస్తుంది
-సీహెచ్ ప్రమీలలక్ష్మి, కోచ్ మహిళా జట్టు
మెళకులు నేర్పించినం
జాతీయస్థాయిలో ఆడిన క్రీ డాకారులు ఈసారి జట్టులో ఉన్నారు. అస్సాం వేదికగా జరుగుతున్న జాతీయ స్థాయి సీనియర్ వాలీబాల్ పోటీల్లో సత్తాచాటేందుకు క్రీడాకారులు పట్టుదలతో ఉన్నారు. వేములవాడలో శిక్షణ బాగా జరిగింది. మంచి మెళకువలతో కూడిన ట్రైనింగ్ ఇచ్చాం.
-బషీరొద్దీన్, కోచ్ పురుషుల జట్టు
శిక్షణ బాగున్నది..
ఐదేండ్లుగా వాలీబాల్ ఆడుతున్నాను. వేములవాడలో మాకు ఇచ్చిన శిక్షణ బాగున్నది. నెట్స్లో తీవ్రంగా శ్రమించినం. నిపుణులు మంచి సూచనలు చేశాం. జాతీయపోటీల్లో పతకం సాధిస్తామనే నమ్మకం ఉన్నది.
– కే శ్రావ్య, జాతీయ స్థాయికి ఎంపికైన వాలీబాల్ క్రీడాకారుడు (మెదక్)