కరీంనగర్ కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 3: కరీంనగర్లోని మార్కెట్ రోడ్ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించుకుందామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ప్రాంగణంలో అధికారులు, నాయకులు, ఉత్సవ కమిటీ బాధ్యులు, దాతలతో సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఈ నెల 14 నుంచి 21 దాకా శ్రీ లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలన్నారు.
జిల్లాలోని ప్రతి ఇంటికీ వేడుకల ఆహ్వానం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్సవాల కోసం తన వంతుగా 5లక్షల నగదును ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చకిలం శ్రీనివాస్కు అందజేశారు. తన లాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఖర్చుల వివరాలను పకడ్బందీగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలను ముందుగానే సమీక్షించుకోవాలని సూచించారు. అధ్యయనోత్సవాల నుంచి శోభాయాత్ర దాకా ఎకడా ఎటువంటి అవాంతరాలు తలెత్తకూడదని, శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ శాఖ ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు.
వేడుకల్లో కచ్చితమైన ప్రోటోకాల్ ను పాటించాలని, రోజూవారీ కార్యక్రమాలకు సంబంధించి మినిట్ టూ మినిట్ షెడ్యూల్ను రూపొందించాలని చెప్పారు. ఇక బ్రహ్మోత్సవాల మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే సమ్మక – సారలమ్మ జాతర కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన కార్యక్రమాలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు నిర్వహించనున్న కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని, దేవాదాయ శాఖ ద్వారా ఉత్సవాలకు సంబంధించి రికార్డులను నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఇక్కడ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో పవన్ కుమార్, డీఎఫ్ఓ బాలామణి, ఆర్డీఓ మహేశ్వర్, డీఎంహెచ్వో లలితాదేవి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టౌన్ ఏసీపీ నరేందర్, జిల్లా పశు వైద్య, పర్సనల్ వర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేందర్, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఆలయ ఈవో ఉడుతల వెంకన్న పాల్గొన్నారు.