విలేకరుల సమావేశంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ వెల్లడి
వేములవాడ రూరల్, ఫిబ్రవరి 8: ఈ నెల 6న బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో జరిగిన దాడి ఘటనలో తీవ్రగాయాలపాలైన ఓ వృద్ధుడు మృతిచెందగా, భూ తగాదానే దీనికి కారణమని పోలీసులు వెల్లడించారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. మంగళవారం వేములవాడ రూరల్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ చంద్రకాంత్ వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. వేములవాడ రూరల్ సర్కిల్ పరిధిలోని బోయినపల్లి మండలం స్తంభంపల్లికి చెందిన ఎర్ర ఎల్లయ్య (66), ఎర్ర లక్ష్మీరాజం కుటుంబాల మధ్య కొంత కాలంగా భూమి విషయమై వివాదం నెలకొన్నది. ఈ క్రమంలో ఈ నెల 6న ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఎర్ర ఎల్లయ్య, అతడి కుమారుడు గంగయ్య, మనుమలు ఉదయ్చరణ్, అభిషేక్ ట్రాక్టర్తో తమ పొలం దున్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్ర లక్ష్మీరాజం, అతడి కుమారులు సుధాకర్, కమలాకర్.. ఎల్లయ్యతో గొడవకు దిగారు. మాటామాట పెరుగడంతో కోపోద్రిక్తులైన సుధాకర్, లక్ష్మీరాజం, కమలాకర్ కట్టెలతో దాడి చేయగా, ఎల్లయ్య, గంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం కరీంనగర్కు తరలించగా ఎల్లయ్య సోమవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులు ముగ్గురిని స్తంభంపల్లి సమీపంలో మంగళవారం అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. భూ సమస్యలుంటే కోర్టుకు వెళ్లాలని, ఘర్షణ పడి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు. నిందితులను వెంటనే పట్టుకున్న వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్తో పాటు బోయినపల్లి పోలీసులను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో బోయినపల్లి ఏఎస్ఐతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.