ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ ట్రాన్స్కో)లో అద్దె వాహనాల టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ‘బంధు’ప్రీతి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. బినామీ పేర్లతో అద్దె వాహనాలను సమకూర్చుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్దమని తెలిసినా అధికారులు వారితో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇటీవల టీఎస్ ట్రాన్స్కోలో నిర్వహించిన టెండర్లలో ఇప్పటికే ఒక చోట అద్దెకు నడుస్తున్న వాహనానికి మరో చోట లీజ్ అగ్రిమెంట్ చేసుకోవడం నిబంధనలకు నీళ్లు వదిలారనడానికి నిదర్శనం. అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అద్దె వాహనాలపై ఆధారపడి జీవిస్తున్న నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోతున్నది. ఈ టెండర్లను రద్దు చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిస్తోంది.
కరీంనగర్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ట్రాన్స్కో పరిధిలోని టెలికాం సర్కిల్ పరిధిలో ఇటీవల ఐదు అద్దె వాహనాల కోసం టెండర్లు పిలిచారు. అందులో కరీంనగర్ ఎస్ఈ కార్యాలయానికి ఒకటి, డీఈ కార్యాలయానికి మరొకటి, కామారెడ్డి జిల్లా డిచ్పల్లి, నిజామాబాద్, రామగుండం ఏడీఈ కార్యాలయాల్లో ఒక్కో వాహనానికి టెండర్లు పిలిచారు. ఈ నెల 7 వరకు టెండర్లు ఆహ్వానించి అదే రోజు తెరిచారు. అయితే, అందులో అవకతవకలు జరిగాయని అద్దె వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. టెండర్లు దాఖలు చేసే విధానంలోనే అధికారులు నిబంధనలు పాటించలేదని వాపోతున్నారు.
నిబంధనల ప్రకారం ఏ చిన్న టెండర్ జరిగినా సీల్ చేసిన బాక్స్లు ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తేనే టెండర్ పత్రాలకు భద్రత ఉంటుంది. కానీ, ఇక్కడ ఎలాంటి బాక్స్లు ఏర్పాటు చేయకుండా కరీంనగర్లోని ట్రాన్స్కో కార్యాలయంలో టెండర్ షెడ్యూళ్లను స్వీకరించి, ఓ అధికారి చేతికి ఇవ్వగా ఆయన తన టేబుల్ డ్రాలో వేసుకోవడం అనుమానాలకు తావిస్తున్నది. సీల్ చేసిన బాక్స్ ఏర్పాటు చేయనట్లయితే టెండర్లు ఓపెన్ చేసి చూసే ప్రమాదం ఉంటుందని, ఇక్కడ ఇదే జరిగి ఉంటుందని అద్దె వాహనదారులు ఆరోపిస్తున్నారు. బినామీ పేర్లతో టెండర్లు దాఖలు చేసిన సంస్థ ఉద్యోగికి సంబంధించిన వ్యక్తికి రెండు చోట్లా టెండర్లు దక్కడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో అద్దె వాహనాల విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, ఈ వాహనాల టెండర్లలో ఆయా సంస్థలు, శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొనరాదన్న నిబంధనలు ఉన్నాయి. టీఎస్ ట్రాన్స్కోలో మాత్రం ఉద్యోగులే బినామీల పేరిట టెండర్లు దాఖలు చేసి నిబంధనలకు విరుద్ధంగా అద్దె వాహనాలను సమకూర్చుతున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో వీరికి సహకరించడం వల్లే ఇది సాధ్యమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామగుండం డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరీంనగర్ ఎస్ఈ, రామగుండం డివిజన్ కార్యాలయాల్లో అద్దె వాహనాలను సమకూర్చేందుకు టెండర్లు వేశాడు.
అధికారుల అండ ఉండడంతో నిబంధన ప్రకారం లేకున్నా వీటిని ఆయన దక్కించుకున్నాడు. అయితే, ఈ టెండర్లు దక్కించుకున్న సంస్థ ఉద్యోగికి అసలు వాహనాలే లేవని తెలుస్తున్నది. ఎస్ఈ కార్యాలయానికి సమకూర్చాల్సిన కారు ఇప్పటికే రామగుండంలోని ఓఅండ్ఎం డీఈ కార్యాలయంలో నడుస్తున్న (టీఎస్ 27 టీ 6542) వాహనాన్ని ఎస్ఈ కార్యాలయంలో సమకూర్చేందుకు కోడ్ చేసినట్లు, అసలు కారు యజమానికి తెలియకుండానే ఇదంతా జరిగినట్లు తెలుస్తున్నది. కారు యజమాని పేరు మీదనే లీజు అగ్రిమెంట్ కూడా జరిగినట్లు సమాచారం. టెండర్ నిబంధనల ప్రకారం రెండేళ్లు ఏదైనా సంస్థలో వాహనాన్ని అద్దెకు నడిపిన అనుభవం ఉండాలి. ఇవేవీ చూడని అధికారులు తమ సంస్థ ఉద్యోగి అనే ఒకే ఒక కారణంతో రెండు వాహనాలను ఒకరికే అగ్రిమెంట్ చేసినట్లు తెలుస్తున్నది.
రామగుండం ఓఅండ్ఎం డీఈ కార్యాలయంలో మరో ఏడాది గడువు ఉన్న వాహనాన్ని ఎస్ఈ కార్యాలయానికి అద్దెకు ఇస్తున్నట్లు పేర్కొనడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఒక వేళ ఇది జరగాలంటే పాత అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి. అదేమీ లేకుండానే ఈ వాహన నంబర్తో అగ్రిమెంట్ చేసుకోవడం టీఎస్ ట్రాన్స్కో అధికారులకే చెల్లింది. తన వాహనం నంబర్తో అగ్రిమెంట్ ఎలా జరిగిందో తనకు తెలియదని మరో పక్క సదరు వాహన యజమాని కూడా ఆశ్చర్యపోతున్నాడు. తాను ఎవరికీ తన వాహన పత్రాలు ఇవ్వ లేదని కూడా చెబుతుండడం గమనార్హం. అంతే కాకుడా, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు. సంస్థలో 30కి పైగా అద్దె వాహనాలు ఉండగా, అందులో ఏడుకు పైగా వాహనాలు సంస్థ ఉద్యోగులే బినామీల పేరిట నడిపిస్తున్నారని తెలుస్తున్నది.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఈ విధంగా అద్దె వాహనాల విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, సంస్థలో ఉద్యోగులే వీటిని బినామీ పేర్లతో కాజేస్తే తమ పరిస్థితి ఏమిటని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిహేను ఏండ్లుగా అద్దె వాహనాలు నడిపించుకుని బతుకుతున్న తామంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళనకు చెందుతున్నారు.
టీఎస్ ట్రాన్స్కోలో మాదిరిగానే అనేక సంస్థల్లో ఇదే విధంగా కొందరు ఉద్యోగులు తమ బంధువులు, స్నేహితుల పేర్లతో వాహనాలు నడిపించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీఎస్ ట్రాన్స్కోలో ఇటీవల జరిగిన ఈ టెండర్లపై అనుమానాలు ఉన్నాయని, ఒకే వ్యక్తికి రెండు చోట్ల వాహనాలు రావడానికి అధికారులే సహకరించి ఉంటారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి నిరుద్యోగులమైన తమకు న్యాయం చేయాలని అద్దె వాహన యజమానులు కోరుతున్నారు.
అద్దె వాహనాల టెండర్లలో నిబంధనలు అతిక్రమించ లేదు. ఏ టెండర్లో తక్కువ కోడ్ చేస్తే దానినే ఆమోదించడం జరుగుతుంది. మేం అదే చేశాం. ఈ టెండర్లు బినామీల పేరుతో వేశారని మాకెలా తెలుస్తుంది? అవి బినామీ టెండర్లని తెలుసుకోవడం మా పని కాదు కదా. రామగుండంలో డీఈ ఆఫీసులో వాహనం ఇక్కడ (కరీంనగర్) రిజిస్టర్ చేశారనే విషయం నాకు తెలియదు. అలాంటిది ఏమైనా ఉంటే వేరే వాహనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందులో ఇబ్బంది ఏమీ ఉండదు. మా సంస్థలో పనిచేసే ఉద్యోగులు టెండర్ వేశారనే విషయాన్ని మేం పట్టించుకోం. టెండర్లు వచ్చాయా..? లేదా చూసుకుని, లీస్ట్ వచ్చిన టెండర్లనే ఫైనలైజ్ చేస్తాం. మా పని అంత వరకే. నేను ఇటీవలే వచ్చా. ఇక్కడ వాహన యజమానుల మధ్య గొడవలు ఉండొచ్చు. ఇవన్నీ నాకు తెలియదు.
– నాగేంద్రరావు, టీఎస్ ట్రాన్స్కో ఎస్ఈ (టెలికాం)