పెగడపల్లి, జనవరి 18: ఇద్దరు అంతర్జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. బుధవారం పెగడపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.45 లక్షల విలువైన ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్యాల సీఐ రమణమూర్తి ఎస్ఐ కొక్కుల శ్వేతతో కలిసి పెగపడల్లి ఠాణాలో వివరాలు వెల్లడించారు. వెల్గటూర్ మండలం కొండాపూర్కు చెందిన దాసరి మనోహర్, జాడి రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల చోరీలు చేశారు. ఈ నెల 13న పెగడపల్లి మండలం బతికపల్లిలో తాళం వేసి ఉన్న దూస రమేశ్ ఇంట్లోకి చొరబడి తులం బంగారం చైన్, వెండి కడియాలు, మొలతాడు, మట్టెలు, బ్రాస్లెట్, రింగ్ను ఎత్తుకెళ్లారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం మండలకేంద్రంలోని నందీ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు బైక్పై వెళ్తుండగా అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేశారు. వారి నుంచి తులం బంగారం, 30 తులాల వెండి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా కరీంనగర్ జిల్లా రామడుగు శివారులో ఆగి ఉన్న ఆటో నుంచి రెండు సెల్ఫోన్లు, మేడిపల్లి మండలం వల్లంపల్లి వద్ద పార్క్ చేసిన హోండా షైన్ బైక్ను ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకొన్నారు. దీంతో పోలీసులు వారిని కోర్టుకు తరలించారు. కాగా, దొంగతనం జరిగిన ఐదు రోజుల్లోనే నిందితులను పట్టుకున్న మల్యాల సీఐ, పెగడపల్లి ఎస్ఐతో పాటు సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, మహేశ్, ఎల్లయ్య, ఉదయ్కుమార్, సంపత్, వెంకటేశ్, మనోహర్, రమాదేవి, రాజు, డ్రైవర్ గంగరాజును జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాశ్, ఎస్పీ సింధూశర్మ అభినందించారు.