జమ్మికుంట, డిసెంబర్ 20: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గంజాయి విక్రయిస్తూ ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు పట్టుబడడం కలకలంరేపింది. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడుల్లో 6.366 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ నాగేశ్వర్రావు బుధవారం జమ్మికుంట ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్లడించారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా గంజాయిని విక్రయిస్తున్నది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన మరో మహిళకు ఆమెతో వ్యాపార సంబంధాలున్నాయి. ఇద్దరూ జమ్మికుంటలో గంజాయిని తెచ్చి అమ్ముతున్నారు. ఈ సమాచారం టాస్క్ఫోర్స్ అధికారులకు అందింది. బుధవారం టాస్క్ఫోర్స్ అధికారుల బృందం కొత్తపల్లిలోని మహిళ ఇంట్లో గంజాయి ప్యాకెట్ను పట్టుకున్నారు.
అదుపులోకి తీసుకొని గంజాయి క్రయవిక్రయాలపై విచారణ చేశారు. విచారణలో ఉప్పల్కు చెందిన మహిళ పేరును వెల్లడించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లక్షా 75వేల విలువజేసే 6.366కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి స్థానిక ఎక్సైజ్ పోలీసులకు అప్పగించామని చెప్పారు. కాగా, స్థానిక ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్ నిందితులిద్దరినీ రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. గంజాయి పట్టుకున్న వారిలో ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ మోసిన్, కానిస్టేబుళ్లు కుమార్, కమలాకర్, ఖాసీం, తదితరులున్నారు.