పన్నులమీద పన్నులు, ధరల పెంపుతో పేదల రక్తం పీలుస్తున్న కేంద్రం, తాజాగా పాలు, అనుబంధ ఉత్పత్తులపై పన్నుపోటుపై టీఆర్ఎస్ భగ్గుమన్నది. సామాన్య ప్రజలపై కక్షగట్టిన బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించింది. ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు పాల్గొని, కేంద్రం వైఖరిపై ధ్వజమెత్తారు. ఇది అత్యంత దుర్మార్గపు నిర్ణయమని, పన్నుల పేరిట ప్రజలను నిండా ముంచుతున్నారని, బీజేపీ దోపిడీకి నిదర్శనమని మండిపడ్డారు. జీఎస్టీని రద్దు చేయాలని, లేదంటే మున్ముందు తీవ్ర పరిణామాలుంటాయని అల్టిమేటం జారీ చేశారు.
కరీంనగర్: తెలంగాణ చౌక్లో నినదిస్తున్న మేయర్ సునీల్రావు, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కార్పొరేటర్లు, నాయకులు
కార్పొరేషన్, జూలై 20 : టీఆర్ఎస్ కదం తొక్కింది. పన్నుల పేరిట పేదల నడ్డి విరుస్తున్న కేంద్రంపై ధ్వజమెత్తింది. పాలు, అనుబంధ ఉత్పత్తులపైనా జీఎస్టీ విధించడంపై రణం కొనసాగించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలతో హోరెత్తించింది. కరీంనగర్ తెలంగాణ చౌక్లో మేయర్ సునీల్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కార్పొరేటర్లతో కలిసి నినదించారు. పాలు కింద పారబోసి నిరసన తెలిపారు. ‘మోదీ డౌన్ డౌన్’ అంటూ చిన్నారులు నినదించారు. మానకొండూర్లో జడ్పీచైర్పర్సన్ విజయ, జీవీ రామకృష్ణారావు నిరసన తెలిపారు. రాబోయే రోజుల్లో అడుక్కు తినేవారిపై కూడా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుందని విమర్శించారు. చిగురుమామిడిలో జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్ రావు, నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి నిరసన తెలిపారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శంకరపట్నంలోని ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. గంగాధర తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, నాయకులు ధర్నా చేశారు. జీఎస్టీ నుంచి పాలు, అనుబంధ ఉత్పత్తులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు.
సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల మానేరు వంతెనపై ధర్నా చేస్తున్న జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, నాయకులు
మానకొండూర్ : పాలుపారబోస్తూ నిరసన తెలుపుతున్న జడ్పీ చైర్పర్సన్ విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నాయకులు
నిత్యావసరాలపై జీఎస్టీ సరికాదు
నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం సరికాదు. దీని వల్ల సామగ్రి ధరలు ఆకాశన్నంటే అవకాశం ఉన్నది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉన్నది. ప్యాకింగ్ వస్తువులపైనే వేస్తున్నామని చెప్పడం భావ్యం కాదు. ఇప్పుడు చిన్నచిన్న ఊర్లల్లో సైతం ప్యాకింగ్ వస్తువులే దొరుకుతున్నాయనే విషయం మరిచిపోవద్దు. కేంద్రం తీరుపై ప్రతిఒక్కరూ ఆగ్రహంగా ఉన్నారు.
– వెంకటేశ్వర్లు, టాక్స్ కన్సల్టెంట్
పాలపై జీఎస్టీ ఎంత వరకు కరెక్ట్
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలపై పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను పెంచడంతో కూరగాయలు, ఉప్పు, పప్పుల రేట్లు బాగా పెరిగాయి. ఇప్పుడు రోజూ తినే పదార్థాలైన పాలు, పెరుగు, మసాలపై జీఎస్టీ విధించి అన్యాయం చేసింది. పార్లమెంట్లో మెజార్టీ ఉన్నదని చెప్పి ప్రజలను పీడించడం ఎంతవరకు కరెక్ట్. ఇప్పటికైనా పెంచిన రేట్లను తగ్గించాలి. లేకుంటే ప్రజలందరూ ఒక్కటై బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొడ్తరు.
– కులదీప్, యువకుడు
ఏం తినుడు? ఎట్ల బతుకుడు?
బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెంచింది. అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైనయ్. ఇంట్ల సరుకుల రేట్లు రెట్టింపైనయ్. సిలిండర్ ధర అమాంతం పెరిగింది. వింటేనే భయమైతున్నది. ఇది చాలదన్నట్లు కేంద్రం మళ్ల పగబట్టింది. పాలు, పెరుగులాంటి పదార్థాలపై జీఎస్టీ విధించి సామాన్యులపై భారం వేసింది. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని గొప్పలు చెప్పుడే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచితే మాలాంటోళ్లు ఏం తినుడు? ఎట్ల బతుకుడు? జీఎస్టీని రద్దు చేయాల్సిందే. లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తరు.
– రజిత, కరీంనగర్