హుజూరాబాద్, ఆగస్టు 4: ‘హుజూరాబాద్ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్ ఇక్కడ ఓటమి భయంతోనే గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని ప్రేలాపనలు చేస్తున్నాడు.. అడ్రస్ లేని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ విశ్వాస ఘాతకుడుగా వ్యవహరిస్తున్నాడు’ అంటూ టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. గురువారం హుజూరా బాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సానుభూతితో గెలిచిన ఆయన ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. పదుల సార్లు ఢిల్లీకి వెళ్లి నియోజకవర్గానికి నయా పైసా తేలేదని మండిపడ్డారు. దమ్ముంటే కేంద్రం ద్వారా మెడికల్ కాలేజీ మంజూరు చేయించాలని సవాల్ విసిరారు. అన్నంపెట్టిన చేతిని నరకాలనుకున్న ఆయనకు మోసం చేయడమే తెలుసని నిప్పులు చెరిగారు.
ప్రొఫెసర్ సాయిబాబా, పౌరహక్కుల నేత వరవరరావును జైల్లో పెట్టించిన పార్టీలో చేరిన ఆయన మానవహక్కుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని దెప్పిపొడిచారు. బ్యాంకులకు రూ. 11లక్షల కోట్లు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లకు అండగా ఉంటున్న పార్టీలో కొనసాగుతున్న ఆయనకు రాష్ట్ర సర్కారును విమర్శించే అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ముంచుతానని ఆయన ప్రగల్బాలు పలుకుతూ పగటి కలలు కంటున్నాడని దునుమాడారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశా రు. విద్యార్థి నాయకుడిని ఓడించామని హుజూరాబాద్ ప్రజలు బాధపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, జడ్పీటీసీ శ్రీరామ్ శ్యాం, మారెట్ కమిటీ వైస్ చైర్మన్ టం గుటూరి రాజ్కుమార్, సింగిల్ విండో చైర్మన్లు సంపత్ రావు, ఎడవెళ్లి కొండాల్ రెడ్డి, పోనగంటి సంపత్రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి, నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, సురేందర్ రెడ్డి , లాండిగే లక్ష్మణ్ రావు, పొనగంటి మల్లయ్య, పింగళి ప్రదీప్రెడ్డి, కృష్ణ ప్రసాద్, శ్రీపతి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.