జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పెద్దపల్లిలో మంత్రి కొప్పుల, ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని, గాంధీ విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. మహాత్ముని సేవలను కొనియాడుతూ, నేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కరీంనగర్ నెట్వర్క్, అక్టోబర్ 2: దేశ స్వాతంత్య్ర ప్రదాత, జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగరంలోని కోతిరాంపూర్లోని గాంధీ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, కలెక్టర్ గోపి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పూల మాల వేసి నమస్కరించారు. ఇక తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జమ్మికుంట పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద విగ్రహానికి మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి నివాళులర్పించారు.
మెట్పల్లి పట్టణంలోని ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ఆవరణలో, తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహాత్ముడి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల పాల్గొన్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంథని మండలం అడవిసోమన్పల్లిలో గాంధీ చిత్రపటానికి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పూలమాల వేసి నివాళులర్పించారు.