కలెక్టరేట్, నవంబర్ 2 : తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కార్యాలయంపై బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్ నాంపల్లిలోని సంఘ భవనంపై మంగళవారం దాడి జరుగగా, నిందితులను ప్రోత్సహించిన బీజేపీ నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రదీప్ మాదిగ, భూక్యా రాజు నాయక్ బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మాట్లాడుతూ, బీజేపీ నాయకుల వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంఘంపై దాడి జరగడం దేశ చరిత్రలో మొదటిసారన్నారు. టీఎన్జీవోల సంఘం నాయకులు అమ్ముడుపోయారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను సంఘ నాయకులు ఖండిస్తే, సంఘ భవనంపై దాడికి దిగడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ శ్రేణుల తీరు ప్రజాస్వామ్యం, తెలంగాణ వాదంపై చేసిన దాడిగా ఉద్యోగులు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ పోరాట సమయంలో టీఎన్జీవోల సంఘం ఉద్యమాలకు రూపశిల్పిగా మారిందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే సహించేది లేదని, తీవ్రంగా ప్రతిఘటించేందకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాలకులు చేపట్టే అనేక పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు కృషి చేస్తున్నారని చెప్పారు. విమర్శలు, నిరసనలు తెలిపారనే అక్కసుతో సంఘ భవనంపై దాడికి పాల్పడడం కక్షపూరిత చర్య అని తేటతెల్లమవుతున్నదన్నారు. నిందితులను గుర్తించి, వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో కేంద్ర సంఘ భవిష్యత్ కార్యచరణ మేరకు ముందుకు సాగుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.