Dharmaram | ధర్మారం, జూలై 14 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో మంగళవారం ఓవర్ లోడ్తో మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను రవాణా శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బృందం ఏఎంవీఐ హరిత యాదవ్, రియాజ్ పట్టుకున్నారు. అధిక బరువుతో రోడ్లపై వెళ్తున్న వాహనాలపై నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించారు. ఇందులో భాగంగా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో కరీంనగర్- రాయపట్నం రహదారిలో ఇద్దరు ఏఎంవీఐలు తనిఖీలు చేపట్టిన సందర్భంలో ఓవర్ లోడ్తో మొరం తీసుకెళ్తున్న నాలుగు టిప్పర్ వాహనాలు పట్టుపడ్డాయి. దీంతో ఆ వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఏఎంవీఐ హరిత యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్లపై అధిక లోడుతో వెళ్లే వాహనాలను నియంత్రించడానికి శాఖ అధికారులు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ గా నియమించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికలోడుపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆమె వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై అధిక బరువుతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ప్రతీ వాహనం ఆర్సీపై ఎంత లోడుతో వాహనం నడపాలని నిబంధన ఉంటుందని దానికి అనుగుణంగా మాత్రమే వాహనాలు ప్రయాణించాలని అన్నారు. పట్టుకున్న టిప్పర్లలో మొరం తరలింపునకు అనుమతి ఉందని అధిక లోడుతో తరలించడం వల్లనే కేసు నమోదు చేశామని అన్నారు.
అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల బస్సులు పిట్నెస్కు లో బడి ఉండాలని అన్నారు. పరిమితికి లోబడి మాత్రమే విద్యార్థులను స్కూల్ బస్సులో తీసుకెళ్లాలని ఆమె సూచించారు. స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్ ఆరోగ్య కరంగా ఫిట్నెస్ తో ఉండాల్సిందేనని అన్నారు. ప్రతీ ప్రైవేట్ బస్సులో డ్రైవర్ తో పాటు ఒక అటెండర్ కచ్చితంగా ఉండాల్సిందేనని ఆమె కరాఖండిగా చెప్పారు. స్కూల్ బస్సులో విద్యార్థులు ప్రయాణించే సమయంలో పిల్లలు వారి తలలు బయట పెట్టకుండా తగు జాగ్రత్తతో తీసుకెళ్లాల్సిన బాధ్యత అటెండర్ దేనని ఆమె తెలిపారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై పాఠశాల యాజమాన్యాలు తగిన దృష్టి పెట్టి జాగ్రత్తగా తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.