సిరిసిల్ల టౌన్, జూన్ 19 : మూడేళ్ల బాలుడు లివర్ సంబంధిత వ్యాధితో దవాఖానకు పరిమితమయ్యాడు. ఆడుకోవాల్సిన వయసులో అపస్మారస్థితికి చేరుకున్నాడు. ధీన స్థిథిలో ఉన్న కొడుకును చూస్తూ ఆ పేద తల్లిదండ్రులు ‘దేవుడా నువ్వే మా కొడుకును కాపాడాలి’ అంటూ తల్లడిల్లుతున్నారు. మానవతామూర్తులు ఎవరైనా ముందుకు వచ్చి తన కొడుకు వైద్యానికి సాయం అందించాలని వేడుకుంటున్నాడు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవైనగర్కు చెందిన గూడూరి రాజశేఖర్-సంజన దంపతులకు మూడేళ్ల కొడుకు మనీశ్ ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం అతడు అస్వస్థతకు గురవడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత పచ్చ కామెర్లు(జాండీస్) అయ్యాయని, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లు తెలిపారు. చిన్నారి ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ ప్లాంటేషన్ తప్పనిసరి అని చెప్పారు. దీని కోసం 25 లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పారు.
ఓ ఏజెన్సీలో నెలసరి జీతంతో పని చేస్తున్న రాజశేఖర్ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా మారగా, తన కొడుకుకు ఇంత ఖరీదైన వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటికే దాదాపు 4 లక్షల వరకు అప్పులు చేసి వైద్యం చేయించాడు. మనీశ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. మానవతా దృక్పథంతో ఎవరైనా మానవతామూర్తులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తన కొడుకు వైద్యానికి సాయం అందించాలని మనీశ్ తల్లిదండ్రులు వేడుకుంటున్నాడు. సాయం చేయాలనుకునే వారు మొబైల్ నంబర్ 9441161257కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.