జగిత్యాల, డిసెంబర్ 8 నమస్తే తెలంగాణ/ మల్యాల: మల్యాల మండలంలోని రాంపూర్, రామన్నపేట, ఒగులాపూర్, గొర్రెగుండం, మద్దుట్ల, నూకపల్లి గ్రామాలను తాకుతూ వరదకాలువ వెళ్తున్నది. ఈ కాలువ నిర్మించిన నాడు ఈ గ్రామాల రైతులు భూములు కోల్పోయినా.. వరదకాలువ జీవనదిలా మారినా.. ఎగువన ఉన్న ఈ ప్రాంత భూములకు నీరందని పరిస్థితి ఉన్నది. దీంతో మద్దుట్ల వద్ద లిఫ్ట్ను ఏర్పాటు చేయాలని రైతులు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు అనేక సార్లు విన్నవించారు. ఈ క్రమంలోనే వరదకాలువకు అవసరమైన చోట తూములు, లిప్ట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం కేసీఆర్ గతంలోనే సూచించడంతో ఇరిగేషన్శాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయా గ్రామాల రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు విన్నవించడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మద్దుట్ల వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు రూపొందించిన ప్రణాళికల ప్రకారం వరదకాలువ సమీపంలోని 76.22 కిలో మీటర్ మైలురాయి వద్ద పంప్హౌస్ నిర్మించడంతోపాటు నేరుగా లిప్ట్ ఏర్పాటు ద్వారా మద్దుట్ల గ్రామంలోని కొత్త చెరువుకు నీటిని తరలిస్తారు. అనంతరం అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గుడికుంట్ల చెరువుకు పంపుతారు. గుడికుంట్ల చెరువు వద్ద మరో అదనపు మోటర్ను ఏర్పాటు చేసి గొర్రెగుండంలోని నల్లమట్టికుంటకు పంపింగ్ చేయనున్నారు. తద్వారా మద్దుట్ల గ్రామంలోని కొత్తచెరువు, నల్లమట్టికుంట, గొర్రెగుండం గ్రామంలోని నల్లమట్టికుంట (తాళ్లయ్యకుంట), నూకపల్లిలోని అలుగుకుంట, రేగులకుంట, ఓగులాపూర్ గ్రామంలోని కొమటికుంట, కుమ్మరికుంట, లక్ష్మణ్రావు కుంటలతోపాటు రాంపూర్ గ్రామంలోని పాత చెరువు, కొత్త చెరువులను సాగునీటితో నింపనున్నారు. అందుకు 45కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తయితే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ విధానం ద్వారా ఆయా గ్రామాల్లోని 1700 ఎకరాలకు నీరందనుండగా, ఆరు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
ఇది ఏండ్లనాటి కల
మద్దుట్ల గ్రామంలో లిప్ట్ ఇరిగేషన్ కల ఈ నాటిది కాదు, ఎన్నోఏండ్లది. అక్కడి రైతుల సమస్యను తెలుసుకుని ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి భూములను సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడం హర్షణీయం. ప్రాజెక్ట్ పనులు పూర్తయితే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. పంటలు పుష్కలంగా పండి రైతులు ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశముంటుంది.
– బోయినిపల్లి మధుసూదన్రావు, సహకారసంఘం అధ్యక్షుడు (నూకపల్లి)
మద్దుట్లకు లిఫ్ట్ ఇరిగేషన్తో అత్యధిక భూభాగం ఉన్న మా గొర్రెగుండం గ్రామానికి ఎంతో మేలు జరుగుతుంది. గ్రామంలో చెరువులు నిండి పుష్కలంగా నీరందుతుంది. ఇప్పటికే మా గ్రామంలో వాణిజ్య పంటలైన మామిడి, ఆపిల్ బేర్, తైవాన్ జామ తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. సమృద్ధిగా సాగునీరందితే సంప్రదాయ పంటలైన వరి, మక్క, సజ్జ, తదితర పంటలను వేసుకోవచ్చు. సీఎం కేసీఆర్ ధన్యవాదాలు.