చలికితోడు ఈదర గాలులు వణికిస్తున్నాయి. ఐదారు రోజులుగా భయపెడుతున్నాయి. మొన్నటిదాకా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు పైనే ఉండగా, ఒక్కసారిగా 15 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం, సాయంత్రం పొగమంచు కురుస్తుండగా, బంగాళాఖాతంలో నెలకొన్న మాండస్ తుఫాన్ ప్రభావంతో పొద్దంతా ఎముకలు కొరికేలా చలి గాలులు వీస్తున్నాయి.
సిరిసిల్ల, డిసెంబర్ 10 : గత నాలుగైదు రోజులుగా చల్లటి గాలులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో నెలకొన్న మాండస్ తుఫాన్ ప్రభావంతో వాతావరణం ఒక్కసారగా మారిపోయింది. రెండు మూడు రోజుల నుంచి అయితే, చలికి తోడు చల్లటి గాలులు పెరగడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. స్వెట్టర్లు, మప్లర్లు, శాలువాలు లేనిదే బయట అడుగు పెట్టడం లేదు. వాతావరణం మారిన పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని మరోవైపు వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.