చరిత్రాత్మక ఆనవాళ్లయిన కాకతీయ కీర్తి తోరణం, తెలంగాణ షాన్ అయిన చార్మినార్ను తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతున్నది. ఇప్పుడున్న చిహ్నంలో ఎలాంటి లోపాలు లేకున్నా.. ఉద్దేశపూర్వకంగానే మారుస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సాహితీవేత్తలు, చరిత్రకారులు, కవులు, కళాకారులు నిరసన తెలుపుతున్నారు. మన తెలంగాణ సంస్కృతి, చరిత్రకు ప్రాధాన్యమిచ్చి కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ఈ చిహ్నానికి ఎంతో గుర్తింపు వస్తే.. ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే సీఎం రేవంత్రెడ్డి మార్చాలనుకోవడం సరికాదని సూచిస్తున్నారు. అధికారంలో ఉన్నామని మార్చుకుంటూ పోతే తెలంగాణ చరిత్రకే మాయని మచ్చగా మిగులుతుందని చెబుతున్నారు. అవి రాచరికపు గుర్తులు కావని, వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని స్పష్టం చేస్తున్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరివేయడమేనని మండిపడుతున్నారు.
జగిత్యాల, మే 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రాంతాన్నంతటినీ ఏకం చేసి పరిపాలించిన కాకతీయులు.. తెలుగు జాతి వైభవాన్ని సుసంపన్నం చేశారని చరిత్రకారులు, సాహితీవేత్తలు, కళాకారులు గుర్తు చేస్తున్నారు. అజంత భాషగా ప్రఖ్యాతి గాంచిన నేటి తెలుగు భాష ఒకరకంగా పరిపూర్ణతను సాధించింది కాకతీయుల కాలంలోనేని, తెలుగు జాతి ముఖ్యంగా తెలంగాణ జాతి ప్రజల నాగరికత, సంస్కృతీ సంప్రదాయాలను, పాలన పటిమను అజరామరం చేశారని కొనియాడుతున్నారు. ఆ నాటి పాలనా వైభవానికి, సుభిక్ష పాలనకు, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచిన కాకతీయుల కీర్తి తోరణం రాచరిక చిహ్నంగా కనిపిస్తుందనడంపై మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటం, దేశంలో తెలంగాణోడి ఖడ్గ చాతుర్యానికి చిహ్నంగా నిలిచిన ఈ కీర్తి తోరణాన్ని తొలగించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన యుద్ధం విజయానికి చిహ్నమైన కీర్తి తోరణాన్ని తొలగించడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ఇక అధికారిక చిహ్నంలో మరో ముఖ్యమైన ముద్ర చార్మినార్ను సైతం తీసి వేయాలని నిర్ణయించడంపై సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చరిత్ర, దాని ప్రాధాన్యతపై అవగాహన లేకుండా చార్మినార్ను ఒక మతపరమైన, రాచరిక పరమైన కట్టడంగా పేర్కొనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కాకతీయుల కీర్తి తోరణం చర్రితను ఒక సారి మననం చేసుకుంటే.. రుద్రదేవుడు కాలంలో ప్రారంభమైన అనుమకొండ కోట అటు తదుపరి వచ్చిన గణపతిదేవ చక్రవర్తి, రాణి రుద్రమ, ప్రతాపరుద్రుడి కాలంలో ఏడు వరుసల్లో పూర్తి చేసుకొన్నట్లుగా చరిత్ర చెబుతున్నది. తెలంగాణ ఖడ్గ చాతుర్యానికి నిదర్శనంగా, తెలంగాణ వీరుల పౌరుషానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నది. ప్రతాపరుద్ర చక్రవర్తి కాలంలోని సాహితీవేత్త, ప్రతాప రుద్ర యశోభూషణం రచయిత అయిన విద్యానాథుడి రచనల ప్రకారం.. క్రీ.శ 1303లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడిపైకి దండయ్రాతకు ఆదేశించడంతో బెంగాల్లో ఉన్న సైన్యాధిపతి మాలిక్ ఫ్రక్రుద్దీన్ జూనా నేతృత్వంలో భారీ సైన్యం హనుమకొండకు బయలుదేరింది.
బెంగాల్, ఒడిషా, ఆంధ్రా ప్రాంతం మీదుగా సబ్బినాడు (వరంగల్, కరీంనగర్ జిల్లాల ప్రాంతం)కు చేరుకున్నది. సబ్బినాడులోని ఉప్పరిపల్లి (ప్రస్తుతం గొడిశాలగా పిలువబడుతున్న సైదాపూర్ మండలంలోని గ్రామం) వద్ద ప్రతాపరుద్రుడి సైన్యం అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో ప్రతాప రుద్రుడి సైన్యానికి రేచర్ల వెన్న వెన్నభూపాలుడి, పోతుగంటి మైలి, మంగయ్యదేవుడు నాయకత్వం వహించగా.. వీరోచిత పోరాటంతో ప్రతాప రుద్రుడి సైన్యం అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాన్ని జయించింది. ఈ విజయానికి చిహ్నంగా అనుమకొండ కోటలో ప్రతాప రుద్రుడు కీర్తి తోరణాలను వేయించినట్లుగా తెలుస్తున్నది. అయితే అప్పుడే గొడిశాల గ్రామ సమీపంలో ఒక తోరణాన్ని నిర్మించారని చరిత్రకారుల ద్వారా తెలుస్తున్నది.
చార్మినార్ చరిత్రను చూస్తే.. గోల్కొండ సుల్తాన్ల అత్యంత ప్రాశస్త్యమైన నిర్మాణం. దీనిని మహ్మద్ కులీ కుతుబ్షా 1591లో ప్రారంభించి 1592లో పూర్తి చేశాడు. కొత్తగా హైదరాబాద్ నగర నిర్మాణం ప్రారంభమైన తర్వాత దానికి మధ్యస్తంగా దీనిని నిర్మించాడు. మహ్మద్ కులీ కుతుబ్షా పాలన చేస్తున్న 1588-90 మధ్య కాలంలో గోల్కొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో కలరా, ప్లేగు ప్రబలి అనేక మంది చనిపోయారు. అనేక చర్యల ఫలితంగా ఆ అంటువ్యాధులను అరికట్టారు. అందుకు చిహ్నంగా చార్మినార్ నిర్మాణం చేపట్టారు. ఈ బాధ్యతలు ఇరాన్ దేశానికి చెందిన మీర్ మొహ్మద్ మోమిన్కు అప్పగించారు. ఆయన ఇండో-ఇప్లామిక్-పర్షియన్ వాస్తుశాస్ర్తాలను రంగరించి నాలుగు కమాన్లు, నాలుగువైపుల తోవలతో చార్మినార్ నిర్మించారు. దీని నుంచి వెళ్లే నాలుగుదారులు నాలుగు ప్రాంతాలకు చిహ్నం కాగా.. వీటి అర్థం గోల్కోండ, హైదరాబాద్ నాలుగు ప్రాంతాల వ్యాపారాల కూడలి అని!
ఏ రాష్ట్ర చిహ్నంలోనైనా, దేశ చిహ్నంలోనైనా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది. దానిని మనం గౌరవించాలి. ఇపుడున్న రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయడం సరికాదు. కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించాలని నిర్ణయించడం ఏ మాత్రం సరైంది కాదు. ప్రస్తుత చిహ్నం ఒక మతానికి, ఒక కులానికి, వర్గానికి సంబంధం లేకుండా ఉన్నది. అందులో నాకు తెలిసి ఎలాంటి లోపాలు లేవు. ఇలాంటి చిహ్నాన్ని మార్చాలనుకోవడమే లక్ష్యమైతే మార్చడం తప్పని నేను భావిస్తున్న. రాష్ట్ర గీతాన్ని తెలంగాణ భావాలకు, సంస్కృతికి సంబంధం లేని వ్యక్తి కీరవాణితో కంపోజ్ చేయించడంపై నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న.
– వారాల ఆనంద్, ప్రముఖ కవి, రచయిత
అధికారంలోకి వచ్చిన పార్టీలు చారిత్రక చిహ్నలను మార్చి ప్రజలపై రుద్దడం కరెక్ట్ కాదు. తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లయింది. తొలిసారి అధికారం చేపట్టిన కేసీఆర్ సర్కారు అత్యంత విశిష్టమైన కాకతీయ చక్రవర్తుల తోరణం, విశ్వఖ్యాతి గాంచిన చార్మినార్, అశోకుడి చక్రంతో మన సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నాన్ని రూపొందించింది. ఈ లోగోను అన్ని వర్గాలు ఆమోదించాయి. ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక పోకడలకు అద్దంపట్టే గుర్తులని భావించి గుడ్డిగా మార్చాలని నిర్ణయించడం విడ్డూరం. ఏ దేశ చిహ్నాలైనా గత పాలకుల గొప్పదనాన్ని సూచించేవే. కేవలం తమ గొప్పతనం కోసం గత ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపేసేందుకు సంకుచితత్వంతో తీసుకున్న నిర్ణయం. సీఎం రేవంత్రెడ్డికి తొందరపాటు పనికిరాదు. కేవలం నలుగురైదురి సూచన మేరకు ఇలాంటి నిర్ణయం చేయడం భావ్యంకాదు. మేధావులు, చరిత్రకారులు, సాహితీవేత్తలతో చర్చించి పునరాలోచించాలి.
– ద్యావరశెట్టి జనార్దన్, జిల్లా తెలంగాణ రచయితల వేదిక, పూర్వ అధ్యక్షుడు